బోజ‌నాలు చేయ‌డానికి మీకు దిక్కులేక కాదు.. నాకు ఏడుపొచ్చి.. మీకు అండగా మేము ఉన్నామ‌ని చెప్ప‌డానికే డొక్కా సీత‌మ్మ ఆహార శిబిరాల‌ను ఏర్పాటు చేసిన‌ట్లు జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ అన్నారు. శుక్ర‌వారం డొక్కా సీత‌మ్మ ఆహార శిబిరాల‌ను ప‌వ‌న్ క‌ళ్యాణ్ ముఖ్యఅతిధిగా హ‌జ‌రై ప్రారంభించారు. ఈసంద‌ర్భంగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాట్లాడుతూ మీకు వేరే ఎక్కడొక చోట ఆహరం లభించొచ్చు. కానీ ఒక రాజకీయ పార్టీగా మీకు మేము అండగా ఉన్నాం అని చెప్పడానికే ఈ ఆహార శిబిరాలను ఏర్పాటు చేసాం.  ఇది మీ అందరికీ చాలా ధైర్యం కలిగిస్తుంది అన్నారు. 


ఒక పక్కన ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికుల ఆత్మస్తైర్యం తీసేసి, ఆత్మహత్యలకు గురిచేసేలా చేస్తుంటే.. మీరు ఆత్మహత్యలు చేసుకోవద్దు మీకు మేము అండగా ఉన్నాం అని చెప్పడానికి ఈరోజు ఆహార శిబిరాలు ఏర్పాటు చేశామ‌ని ప‌వ‌న్ తెలిపారు. సినిమాలు వేరు రాజ‌కీయాలు వేరు అని అన్నారు ప‌వ‌న్.  సినిమాల్లో చేసినవి నిజ జీవితంలో చెయ్యడం చాలా కష్టమైన పని. సినిమాల్లో ఇలాంటి సీన్ చేస్తే చప్పట్లు కొట్టి చాలా బాగుంది అంటాము. 


కానీ వాస్తవంలో ఒక సమస్యకు పరిష్కారం ఇవ్వడానికి చాలా కష్టపడాలి.  రెండున్నర గంటల సినిమాలో సమస్యలకు పరిష్కారం చూపొచ్చు కానీ నిజ జీవితంలో సమస్యల పరిష్కారానికి చాలా సమయం పడుతుంది, కొన్ని సంవత్సరాలు పడుతుంది. నేను ఏ రోజున కూడా రాజకీయాల్లో వ్యక్తిగత గుర్తింపు కోరుకోలేదు. సగటు మనిషికి అండగా నిలబడాలి అని నేను రాజకీయాల్లోకి వచ్చాను. నేను మీ గొంతు అవ్వడానికి రాజకీయాల్లోకి వచ్చాను. మీ కడుపు మండితే మీ కడుపు మంట నా గొంతుగా మారి మీ కడుపును చల్లార్చాలని  నేను రాజకీయాల్లోకి వచ్చాను అని ప‌వ‌న్ క‌ళ్యాణ్ తెలిపారు. సగటు మనిషి బతికేలా సామాజిక పరిస్థితులు ఉండాలనే కారణంతోనే జనసేన పార్టీ ఆవిర్భవించిన‌ట్లు ప్ర‌క‌టించారు.  


151 సీట్లు పొంది అధికారం చేప‌ట్టిన వైసీపీ ప్ర‌భుత్వం  భవన నిర్మాణ కార్మికుల సమస్యలను 5 నెలలుగా వదిలేసి, 50 మందిని చంపేసి, ఇప్పుడు ఇసుక వారోత్సవాలు చేస్తున్నారని ఆరోపించారు. గత ప్రభుత్వం చేసిన తప్పులను నేను చాలా బలంగా ఎండగట్టాను. గత ప్రభుత్వం చేసిన తప్పులను సరిదిద్దే ప్రయత్నంలో మొత్తానికి ఇసుకను కుళాయిలో వచ్చే నీరు మాదిరిగా ఆపేస్తే ఈరోజున 35 లక్షల మంది రోడ్డున పడ్డారని విమ‌ర్శించారు. నేను వ్యక్తిగత ద్వేషం లేనివాడిని, నాకు శత్రువులు ఉండరు. కానీ ప్రజల సమస్యల కోసం శత్రుత్వం పెట్టుకుంటాను, ప్రత్యర్థులుగా భావిస్తాను. 


జగన్,  చంద్రబాబు తో  నాకు వ్యక్తిగత ద్వేషం లేదు. కానీ వారి విధివిధానాలు ప్రజలను చంపేస్తుంటే ప్రజలు కోసం నేను వారి మీద శత్రుత్వం పెట్టుకుంటాను. ఒకతను వచ్చి మీరు కూడా మాతో భోజనం చెయ్యండి అని అడిగారు, నేను కార్తీకమాసం చేస్తాను, సాయంత్రం పూట మాత్రమే తింటాను అని చెప్పాను. ఇంకోరోజు మీతో కూర్చుని తింటాను. కార్తీకమాసం వల్ల మీతో కలిసి తినలేకపోతున్నాను, అందుకోసం మనస్ఫూర్తిగా మిమ్మల్ని క్షమాపణలు కోరుతున్నాను. బొత్సకు, మిగతా 150 మంది ఎమ్మెల్యేలకు  ఆకలి బాధలు తెలుసా? ఒకవేళ మీకు ఆ బాధ తెలిసి ఉంటే మీ విధివిధానాలతో ఈరోజున ఇంత మందిని చంపి ఉండరు. ఇది చాలా కడుపు మండుతుంది అంటూ ప‌వ‌న్‌ ప్ర‌శ్నిస్తూనే, ఘాటుగా విమ‌ర్శించారు.


ఈరోజున అమరావతిని వైసీపీ వాళ్ళు రాజధానిగా వద్దంటున్నారు.. వేల ఎకరాలు చంద్రబాబు ప్రజల దగ్గర తీసుకుంటుంటే ప్రతిపక్షం లో ఉన్న వైసీపీ ఎం చేసింది? ఆరోజున మీరందరూ కూర్చుని ఏకగ్రీవ తీర్మానం చేస్తేనే కదా ఈరోజు అమరావతి వచ్చింది.  ఏకగ్రీవ తీర్మానం చేసిన తర్వాత , ప్రధాని  చేత శంఖుస్థాపన అయిన తర్వాత చంద్రబాబు  మీద కోపంతోనో లేక ప్రధాని మీద కోపంతోనో రాజధానిని ఆపేస్తే భవన నిర్మాణ కార్మికుల్లా అనేక మంది పస్తులతో బాధ పడాలి. అమరావతి విషయంలో గత ప్రభుత్వ విధివిధానాలు నచ్చకపోతే వాటిని కుదించి కొత్త విధివిధానాల ద్వారా అమరావతి నిర్మాణం జరిగితే భవన నిర్మాణ కార్మికులు పక్క రాష్ట్రం వలస వెళ్లకుండా ఇక్కడే పనిచేసుకుంటారు. 


కావాలంటే రాజధానిని పులివెందులలో పెట్టుకోండి, నేను కూడా వస్తాను. త్వరగా ఏదొక నిర్ణయం తీసుకోండి. నాకు 150 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, నేను పులివెందులలో రాజధాని పెట్టుకుంటా అంటే సంతోషమే! ప్రజల ఆమోదం తీసుకుని త్వరగా తీర్మానం పెట్టండి అంటూ సీఎం జ‌గ‌న్‌ను ప‌రోక్షంగా సూచించారు. ప్రభుత్వం సరిగ్గా పాలన అందిస్తే చప్పట్లు కొట్టి అభినందిస్తాను.  నేను శాపనార్ధాలు పెడుతున్నాను అని వైసీపీ వాళ్ళు బాధపడుతున్నారు. నేను శాపనార్ధాలు పెడితే మీరు భయపడడానికి నేను ఏమైనా ఋషి నా? ఒక సమూహం తాలూకు కడుపు మంట కచ్చితంగా శాపం అవుతుంది. 


50 మంది చనిపోతే ఆ బాధ ఎలా ఉంటాది? ఇదే మీ ఎమ్మెల్యేల ఇళ్లల్లో అన్నం లేకుండా చేస్తే మీరు ఊరుకుంటారా? అలా చేస్తే బొత్స సత్యనారాయణ  చీపురుపల్లిలో రోడ్డు మీదకు వచ్చి వీరంగం సృష్టిస్తారు. 150 మంది వైసీపీ ఎమ్మెల్యేలు చక్కని పరిపాలన అందించాలని కోరుతున్నాను, ఒకవేళ మీరు అలా చెయ్యని పక్షంలో మేము చాలా బలంగా పోరాటం చేస్తాం..జనసైనికులు చాలా బలం కలవారు, గుర్తుపెట్టుకోండి. మేము చాలా సైద్ధాంతిక బలంతో రాజకీయాల్లోకి వచ్చామన్నారు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.
పార్టీలో ఇద్దరిని, ఈ పార్టీలో ఇద్దరిని లాక్కొని రాజకీయాలు చెయ్యడానికి మేము రాజకీయాల్లోకి రాలేదు.

ఒకవేళ ఎవరైనా పార్టీలోకి వచ్చినా గాని మా సిద్ధాంతాలను అర్ధం చేసుకోమని చెప్తాం. అలా వచ్చినవారిలో కొంత మంది ఉన్నారు, అవకాశవాదంతో వచ్చిన వారు వెళ్లిపోయారు. పార్టీకు అండగా నిలబడే వాళ్లే కావాలి గాని నిలబడలేని వారు మాకు అవసరం లేదు. ఒత్తిడి తీసుకోలేని వారు రాజకీయాల్లో నిలబడలేరు. దొడ్డి దారుల్లో జనసేనలోకి వస్తానంటే కుదరదు. మొన్న లాంగ్ మార్చ్ కి వచ్చిన వారిలో మూడో వంతు భవన నిర్మాణ కార్మికులైతే, ఒక వంతు జనసేనకు సంబంధం లేని ప్రజలు అయితే మరొక వంతు జనసైనికులు. వచ్చిన 5 నెలల్లో 50 మందిని చంపేసి ప్రజా వ్యతిరేఖత వైసీపీ వాళ్ళు కూడగట్టుకున్నారు. అంతటి ఘనత వైసీపీ వారు సాధించారు. 


భవన నిర్మాణ కార్మికులకు మరియు ఇతర అనుబంధ రంగాల వారికి మాట ఇస్తున్నా..మీ పోరాటమే మా పోరాటం. గతంలో 1400 మంది చనిపోయారని చెప్పి ఓదార్పు యాత్ర పేరుతో ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్లారు. ఈరోజు 50 మంది భవన నిర్మాణ కార్మికులు చనిపోతే నష్టపరిహారం ఇవ్వడానికి వారికి మనస్సు ఒప్పట్లేద‌ని ప‌వ‌న్ విమ‌ర్శించారు. మంగళగిరి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డికి నష్టపరిహారం ఇవ్వడానికి మనస్సు ఒప్పట్లేదా? ప్రగల్బాలు పలకడానికేనా మీరు ఉంది? ఆరోజున వైసీపీ కి ఓటు వేసిన ప్రజలు పిలిస్తేనే నేను రాజధానికి వచ్చా.. తెలుగుదేశం ప్రభుత్వానికి ఎదురెళ్లి భూసేకరణ చట్టాన్ని జనసేన ఆపింది. 


ఆరోజున వైసీపీకు భూసేకరణ చట్టాన్ని ఆపేంత దమ్ములేదు. చనిపోయిన భవన నిర్మాణ కార్మికులకు నష్టపరిహారం ఇవ్వాల్సిందే! మేము మీ సొంత డబ్బు ఇమ్మనట్లేదు, ప్రజల దగ్గర నుండి వసూలు చేసిన శిస్తును నష్టపరిహారంగా ఇవ్వమని అడుగుతున్నాము. 5 నెలలుగా పని లేకుండా బతుకుతున్న భవన నిర్మాణ కార్మికులకు నెలకు రూ.10వేలు చొప్పున రూ.50వేల‌  ప్రభుత్వం తరపున ఇవ్వండి. ఈ డిమాండ్ ను ప్రభుత్వం అంగీకరించి ప్రజలకు అండగా నిలవాలని ప‌వ‌న్ క‌ళ్యా ణ్ సూచించారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: