పట్టపగలు.. అందరూ ఆహ్లాదం కోసం వచ్చే పార్కులోనే ఓ యువతిపై గ్యాంగ్రేప్ జరిగింది. ఈ దారుణ సంఘటన నోయిడాలో చోటుచేసుకుంది. నోయిడా శివారు చిజరాసి గ్రామానికి చెందిన 20ఏళ్ల యువతి
డిగ్రీ వరకు చదువుకుంది. అయితే కుటుంబ ఆర్థిక పరిస్థితులు బాగోలేకపోవడంతో ఉద్యోగం చేయాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలోనే పలు ఇంటర్వ్యూలకు హాజరవుతూ వస్తోంది.
జాబ్ ప్రయత్నాల్లో భాగంగా తన స్నేహితుడు రవికి రెస్యూమ్ ఇచ్చేందుకు బుధవారం నోయిడాలోని ఓ పార్కు వద్దకు చేరుకుంది. రవితో కలసి పార్కులో కూర్చుని మాట్లాడుతున్న క్రమంలో ఓ ఇద్దరు అక్కడికి చేరుకుని యువతితో అసభ్యంగా ప్రవర్తించారు.
ఆమె గట్టిగా సమాధానం చెప్పడంతో అక్కడి నుంచి వెళ్లినట్లే వెళ్లి మరో నలుగురు స్నేహితులతో అక్కడికి చేరుకున్నారు. యువతి స్నేహితుడు రవిపై దాడి చేసి...ఆమెను చెట్ల పొదల్లోకి తీసుకెళ్లి ఒకరి తర్వాత మరొకరు అత్యాచారానికి పాల్పడ్డారు. నడవలేని స్థితిలో ఉన్నా ఆమెను చెట్ల పొదల్లోనే వదిలేసి వెళ్లిపోయారు. తీవ్ర రక్త స్రావంతో ఆమె కొద్దిసేపటి వరకు స్పృహ కోల్పోయింది. స్నేహితుడు రవి సాయంతో నేరుగా
పోలీస్ స్టేషన్కు చేరుకున్న ఆమె గ్యాంగ్ రేప్నకు పాల్పడిన ఆరుగురిపై ఫిర్యాదు చేసింది. ఈ కేసును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న నోయిడా పోలీసులు ఇద్దరు నిందితులను
అరెస్ట్ చేశారు.
మరో నలుగురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నిందితులపై గతంలోనూ అనేక కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. పార్కు ప్రవేశం వద్ద ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించడంతో పాటు అదుపులోకి తీసుకున్న నిందితుల
ఫోన్ కాల్స్ను విశ్లేషించే పనిలో పడ్డారు. ఇలాంటి ఘటనలు నోయిడాలో గతంలోనూ జరగడంతో ఈ సంఘటనపై పోలీసులు తీవ్రంగా స్పందిస్తున్నారు. నిర్భయతో పాటు పలు సెక్షన్ల కింది కేసులు నమోదు చేయాలని పోలీసులు భావిస్తున్నారు. కామాంధులకు సరైన శిక్షలు పడితే గాని ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయని పోలీసులు పేర్కొంటున్నారు.