బండ్లు ఓడలు, ఓడలు బండ్లు కావడం అంటే ఇదేనేమో కాబోలు. ఒకప్పుడు దేశంలోనే అత్యంత ధనవంతుడిగా ఒక వెలుగు వెలిగిన ఆయన ఇప్పుడు అప్పుల ఊబిలోకి కూరుకుపోయారు. ఆఖరికి అన్నకు ఇష్టమైన కంపెనీని ఆస్తి పంపకంలో దక్కించుకొని, దానికి కూడా నిలుపుకోలేకపోయారు ఆ పెద్ద మనిషి. ఇదంత ఎవరి గురించి అనుకుంటున్నారా? ధీరుభాయ్ అంబానీ కొడుకు, ముకేశ్  అంబానీ తమ్ముడు అయిన అనిల్ అంబానీ గురించి.


అనిల్ అంబానీ తాజాగా రిలయన్స్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ పదవి నుంచి విరమించుకున్నారు. ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన ఈ కంపెనీని తను రక్షించలేక ఆయన చేతులెత్తిసిన విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా అనిల్ అంబానీ ఆర్‌. కామ్ కంపెనీ డైరెక్టర్‌ పదవికి రాజీనామా చేసేశారు.


కేవలం అనిల్‌ అంబానీ మాత్రమే కాకుండా ఆయనతో పాటు నలుగురు డైరెక్టర్లు కూడా కంపెనీకి రాజీనామా చేయడం జరిగింది. దివాలా ప్రక్రియ కింద ఆస్తులు అమ్మకానికి ఉంచిన రిలయన్స్ కంపెనీ నుంచి అనిల్‌ అంబానీతో పాటు ఛాయా విరాణి, రైనా కరానీ, మంజరి కకేర్‌, సురేష్‌ రంగాచారీలు డైరెక్టర్‌ లుగా విరమించుకున్నారు. రిలయన్స్ కమ్యూనికేషన్స్ బీఎస్‌ఈకి ఇచ్చిన నోటీసులో ఈ అంశాన్ని తెలియ పరిచింది. కాగా గతంలో కంపెనీ డైరెక్టర్‌, సీఎఫ్‌ఓ వి.మణికంఠన్‌ రాజీనామా చేశారని, వీరి రాజీనామాలను కంపెనీ రుణదాతల కమిటీకి నివేదిస్తామని ఆర్‌. కామ్‌ తెలియచేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో కంపెనీ నష్టాలు రూ.30,142 కోట్లకు చేరిన విషయం అందరికి తెలిసిందే.


ఇకపోతే దేశీ టెలికం కంపెనీలు వరుసగా భారీ నష్టాలను ప్రకటిస్తుండటం ఆందోళన చెందే విషయమే. ఇక లైసెన్స్‌ ఫీజు, స్పెక్ట్రమ్ బకాయిలకు కేటాయింపుల అనంతరం వొడాఫోన్‌ జులై, సెప్టెంబర్‌ కాలానికి ఏకంగా రూ.50,921 కోట్ల నష్టాలు చూపించింది. మరో టెలికం కంపెనీ భారతీ ఎయిర్‌ టెల్‌ కూడా రూ.23,000 కోట్ల నష్టాలను నమోదు చేయడం కూడా ఆలోచించాల్సిన విషయం.



మరింత సమాచారం తెలుసుకోండి: