ఏపీలో రాజకీయ ఉనికి కోసం టీడీపీ, బీజేపీ మతాన్ని కూడా రాజకీయం వైపు లాగుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏపీ సీఎం జగన్ క్రైస్తవుడు కావడంతో … ఈ విషయాన్ని తమకు అనుకూలంగా మలచుకోవాలని ప్రతిపక్షాలు భావిస్తున్నాయని వైసీపీ నేతలు మండిపడుతున్నారు. ఈ అంశంపై మీడియాతో మాట్లాడిన దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ వాస్తవాలు ఇవీ అంటూ వివరించారు.
మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఇంకా ఏమన్నారంటే.. “ చంద్రబాబు టీడీపీని కూడా బీజేపీలో విలీనం చేయడానికి అన్ని విధాలుగా అడుగులు వేస్తూ.. సీఎం వైయస్ జగన్పై మతపరమైన ఆరోపణలు చేస్తున్నాడు. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలన్నీ టీడీపీ చేయిస్తుంది. తిరుమల కొండపై శిలువ, తిరుమల బస్సు టికెట్ వెనుక అన్యమతప్రచారం. సీఎం వైయస్ జగన్ గంగానదిలో మునిగి మోసం చేశాడు అని, వైయస్ జగన్ తిరుమల ప్రసాదం స్వీకరిస్తారో లేదో..పవన్. భవానీ ఐల్యాండ్లో ఘోరాలు అని కన్నాలక్ష్మీనారాయణ, అన్నవరంలో అన్యమత ప్రచారం, శ్రీశైలంలో అన్యమత ఉద్యోగులు, గుంటూరులో దుర్గగుడి కూల్చేశారు అంటూ తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు.
వీటిపై చంద్రబాబు, పవన్ చర్చకు వస్తానంటే దేవాదాయ శాఖ మంత్రిగా సిద్ధంగా ఉన్నాను.తిరుమలలో శిలువ అని సోషల్ మీడియాలో చూశారు.. సోలార్ ప్యానల్ను శిలువ అని మత ప్రచారం చేశారు. కన్నా లక్ష్మీనారాయణ భవానీ ఐల్యాండ్లో 40 ఇయర్స్ ఇండస్ట్రీ నిర్మాణం చేసిన తోరణం చూసి వైయస్ జగన్ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేశాడు. తిరుపతి బస్సు టికెట్లలో అన్యమత ప్రచారాలు అంటున్నారు. ఆ టికెట్లు ముద్ర గత ప్రభుత్వంలో జరిగింది. గుంటూరులో గుడి కూల్చేరారని దుష్ప్రచారం చేస్తున్నారు. గుడి కోసం స్థలం ఇచ్చారు. నిర్మాణం కూడా పూర్తయింది.
పూజారికి, కమిటీకి ఉన్న విభేదాలతో కావాలని యాగి చేస్తుంటే మళ్లీ అదే గుడికి స్థలం కూడా కేటాయించాం. ప్రభుత్వంపై బురదజల్లాలని చంద్రబాబు, పవన్ చివరికి మతాలను అడ్డుపెట్టుకొని రాజకీయాలు చేయడం నీచమైన చర్య. రూ.234 కోట్లు హిందూ దేవాలయాలు, అర్చకుల అభివృద్ధికి కేటాయించిన మొదటి ప్రభుత్వం వైయస్ జగన్ది. అటువంటి వ్యక్తిపై మతం బురదజల్లేందుకు ప్రయత్నం ఇప్పటికైనా మానుకోవాలని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ సూచించారు.