ఒక కుక్కను చంపాలంటే.. అది పిచ్చికుక్క అని ఓ ప్రచారం కల్పిస్తే.. చాలు మనచేతులకు కూడా మట్టి అంటకుండా పని జరిగి పోతుందనేది ఓ ఆంగ్ల సామెత!! ఇప్పుడు ఏపీలోనూ ఇదే తరహా రాజకీయాలు తెరమీదికి వస్తున్నాయి. జగన్ ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు, ఆయన ప్రభుత్వంపై మరకలు వేసేందుకు, విభిన్న రూపాల్లో ప్రభుత్వాన్ని బలహీనపరిచి, ``జగన్ కు అధికారం అప్పగించడం మా తప్పయిపోయింద``ని ప్రజల చేతులతో ప్రజలే తమ చెంపలు కొట్టుకునేలా చేసేందుకు చేసిన అనేక ప్రయత్నాలు ఇప్పటి వరకు ప్రత్యర్థులకు చుక్కలు చూపించాయి. అవి ఏవీ కూడా సత్ఫలితాలను ఇవ్వలేదు. వీటిలో అనేక ఉద్యమాలు, నిరసనలు అంటూ ప్రతిపక్షాలు ఆడిన నాటకాలను ప్రజలు పెద్దగా పట్టించుకోలేదు.
అయినా కూడా జగన్ను విడిచి పెట్టకూడదని ప్రతిపక్షంలో ని ఓ వర్గం గట్టిగా నిర్ణయించుకుంది. ముఖ్యంగా కమ్మ సామాజిక వర్గాన్ని బలహీన పరిచి, తన అధీనంలోకి అంటే.. తన పార్టీలోకి చేర్చుకుంటున్న జగన్తో ఎప్పటికైనా తమకు ప్రమాదం పొంచి ఉందని,
టీడీపీ ఉనికి కూడా ప్రమాదం వాటిల్లుతుందని భావిస్తున్న ఈ వర్గం.. ఇప్పుడు రాష్ట్రంలో జగన్ ప్రవేశ పెట్టేందుకు కంకణం కట్టుకున్న ఓ కీలక పథకాన్ని తమకు అనువుగా మార్చుకుని జగన్ను నాలుగు రోడ్ల కూడలిలో నిలబెట్టి పరువు తీసేందుకు, ఓటు రాజకీయం చేసేందుకు ఈ వర్గం ప్రత్యేకంగా పనిచేస్తోంది.
ఈ క్రమంలోనే వచ్చే ఏడాది విద్యాసంవత్సరం నుంచి రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియంను ఎట్టి పరిస్థితిలోనూ అమలు చేసితీరుతామని చెప్పిన జగన్పై ఇప్పటి వరకు అనేక విధాలుగా పోరాటం చేసిన ప్రతిపక్ష నాయకులు జనసేనాని సహా అందరూ చేతులు ఎత్తేశారు.నేను ఎవరి మాటా వినేది లేదు.. ముందు మీ పిల్లలు ఎక్కడ చదువుతున్నారు? ఏ మీడియంలో చదువుతున్నారో చెప్పండని జగన్ నిగ్గదీసేసరికి వీరంతా తోకలు ముడిచేశారు.
అదే సమయంలో
బీసీ,
ఎస్టీ,
ఎస్టీ ల్లోని పేద పిల్లలు ప్రభుత్వ స్కూళ్లలో విద్యను చదువుతున్నారని, వీరికి ఇంగ్లీష్ మీడియంను దూరం చేస్తారా ? ఉన్నవారి పిల్లలకే ఇంగ్లీష్ మీడియం చదువులా ? అని జగన్ ప్రశ్నించేసరికి ఒక్కసారిగా నోళ్లకు తాళాలు వేసుకు న్నారు ఈ నాయకులంతా! అయితే, ఇంతటితో ఈ వివాదానికి తెరపడిపో యిందని అందరూ అనుకున్నారు. కానీ, ఇప్పుడు ఓ
మీడియా అధినేతతో కలిసి కుమ్మక్కయిన ఈ ప్రత్యర్థి వర్గం.. జగన్ చేస్తున్న సమున్నత ప్రయత్నానికి.. మతం రంగు పులిమింది. కేవలం
బీసీ,
ఎస్సీ, ఎస్టీలను క్రైస్తవులుగా మార్చేందుకు జగన్ ఈ ఇంగ్లీష్ను తీసుకువస్తున్నారని వితండవాదాన్ని తెరమీదికి తెచ్చి.. పైశాచికానందం పొందుతున్నారనే విమర్శలు వస్తున్నాయి.
నిజానికి ఇంగ్లీష్ చదివిన వారంతా క్రైస్తవులుగా మారితే.. మరి ఇలాంటి ఆరోపణలు చేస్తున్నవారు, పార్టీల అధినేతల కుమారులు, వారి కుమారులు కూడా ఆంగ్లంలోనే చదువుకున్నారు కదా? వారంతా మతం మార్చేసుకున్నారా? ఉత్తుత్తి పలుకులు పలికే కొందరి కుమారులు కూడా ఆంగ్లంలోనే చదువుకున్నారు కదా.. మరి వారు కూడా మతం మార్చేసుకుని
బైబిల్ పట్టుకుని తిరుగుతున్నారా? అంటే.. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ను ప్రవేశ పెట్టినంత మాత్రాన.. జగన్ క్రైస్తవాన్ని ప్రోత్సహిస్తున్నాడని అంటున్న ఈ కుహనా నాయకులు,.. పేరెన్నికగన్న
మీడియా అధిపతులు.. తెలుసుకోవాల్సిన కీలక విషయం ఒకటి ఉంది. అదేంటంటే..
అసలు మునిసిపల్ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంను ప్రవేశ పెట్టాలని తామే ప్రయత్నించామని, కానీ, అప్పట్లో ప్రతిపక్షంగా ఉన్న జగన్ ఆందోళన, నిలదీతలు, కొందరు మేధావుల సూచనల మేరకు వెనక్కి తగ్గామన్న
టీడీపీ అధినేత చంద్రబాబు తనయుడు, మాజీ
మంత్రి నారా లోకేశ్ వ్యాఖ్యలను పరిశీలిస్తే.. బాగుంటుందని సూచిస్తున్నారు పరిశీలకులు.
ఈ లెక్కన అంటే.. ఈ కుహనా వాదులు చెబుతున్నట్టు.. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ను ప్రవేశ పెడితే.. మత మార్పిడులు, క్రైస్తవాన్ని ప్రోత్సహించినట్టని భావిస్తే.. ఈ ప్రయత్నం.. తమకు ఎంతో కమ్మనైన చంద్రబాబు హయాంలో జరిగిందనే విషయాన్ని ఖచ్చితంగా అంగీకరించి తీరాలి.!!
నాడు రాని ఈ సందేహాలు, అనుమానాలు, శంకలు ఇప్పుడే రావడం వెనుక కేవలం వారికి సంచులు అందకపోవడమే కారణంగా కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు. విషయంతో పనిలేకుండా.. అది ఏదైనా సరే.. జగన్ను దోషిగా నిలబెట్టాలనే ప్రయత్నం మానుకుంటే మంచిదని అంటున్నారు.. మరి వీరు తెలుసుకుని కళ్లు తెరుచుకుంటారో లేదో చూడాలి.!!