విశాఖలో ఒక కామాంధుడి వికృత చేష్టలు ఆలస్యంగా వెలుగు చూశాయ్‌. పక్కింట్లోని ఇద్దరు బాలికలపై మూడు నెలలుగా లైంగిక దాడి చేస్తున్నాడు. వారితో బాబాయ్‌ అని పిలుపించుకుంటూనే ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు నిందితుడు. ఈ క్రైమ్‌కు సంబంధించి పోలీసులు వెల్లడించిన అంశాలు మరింత సంచలనం రేకెత్తించాయ్‌. నిందితుడైన పెందుర్తి చినముసిడివాడకు చెందిన అరవింద్‌ను అరెస్ట్ చేశారు పోలీసులు. 


అరవింద్‌ లారీ ట్రాన్స్‌పోర్ట్‌ యజమాని. పక్కింట్లోనే ఉంటోన్న పది, ఎనిమిదో తరగతి చదువుతున్న ఇద్దరు బాలికలను మూడు నెలలుగా లైంగికంగా వేధిస్తున్నాడు. బాధిత బాలికలిద్దరూ అక్కచెల్లెళ్లు. నిందితుడి భార్య, బాధిత బాలికల తల్లి గతంలో ఒకే దగ్గర బ్యూటీ పార్లర్‌ కోర్సులో శిక్షణ తీసుకున్నారు. ఆ పరిచయం ఒకరినొకరు అక్కా, చెల్లి అని పిలుచుకునేంత బలపడింది. దీంతో ఒకే దగ్గర నివాసాలు ఏర్పాటు చేసుకున్నాయి రెండు కుటుంబాలు. పిల్లలు కూడా అరవింద్‌ ఇంటికి చేరుకుని అతడిని బాబాయ్‌..  బాబాయ్‌ అని పిలిచేవారు. 


ఈ నెల 3వ తేదీన నిందితుడు తన భార్యతో గొడవపడ్డాడు. ఆపై పక్కింటిలో ఉంటూ తనను బాబాయ్‌ అని పిలిచే ఇద్దరు బాలికలను కారులో ఎక్కించుకుని సింహాచలం వెళ్లాడు. అక్కడ పెద్దమ్మాయిని పెళ్లి చేసుకుని అటునుంచి అటే.. తాడేపల్లిగూడెం, విజయవాడ, ఒంగోలు తీసుకెళ్లి ఇద్దరు బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. అయితే ఆ బాలికలను మూడు నెలలుగా లైంగికంగా వేధిస్తున్నట్లు చెబుతున్నారు పోలీసులు. నిందితుడిని అరెస్ట్‌ చేసి.. వారి చెర నుంచి బాలికలకు విముక్తి కలిగించారు. పోలీసుల తనిఖీలలో నిందితుడి దగ్గర ఒక ప్రెస్‌ ఐడీ కార్డు లభించింది. తాను నడిపే లారీని పోలీసులు, ఆర్టీయే అధికారులు ఆపితే.. ఈ కార్డు  చూపించి తప్పించుకునేవాడని గుర్తించారు. ఈ కామాంధుడిని కఠినంగా శిక్షించాలని బాధితుల తల్లిదండ్రులతో పాటు స్థానికులు కోరుతున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: