తెలంగాణలో జోరుగా సాగుతున్న
ఆర్టీసీ సమ్మెలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఓ వైపు
ఆర్టీసీ సమ్మె విషయంలో యాజమాన్యం దాఖలు చేసిన అఫిడవిట్ కలకలం సృష్టించగా...తాజాగా
ఆర్టీసీ సమ్మె విషయంలో
బీజేపీ నేతలు ఇప్పుడు ఇరకాటంలో పడ్డారని అంటున్నారు. ప్రైవేటు రూట్ పర్మిట్ల విషయంలో హైకోర్టు- కేంద్రాన్ని ప్రతివాదిగా చేర్చడంతో వారి గొంతులో పచ్చివెలక్కాయ పడినట్టయిందని చెప్తున్నారు.
కేంద్ర ప్రభుత్వం రూపొందించిన మోటర్ వాహన చట్టం-2019 ప్రకారమే ప్రభుత్వం ప్రైవేట్ బస్సులకు పర్మిట్లు ఇవ్వాలని నిర్ణయించిందని ప్రభుత్వం స్పష్టం చేయడంతో...బీజేపీ నేతలు...ఈ అంశంపై దూకుడుగా ముందుకు సాగడం లేదంటున్నారు.
2019 సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి వచ్చిన కొత్త మోటర్ వాహనాల సవరణ చట్టం-
2019, సెక్షన్ 67 ప్రకారం ప్రజలకు మెరుగైన రవాణా సదుపాయాలు, పోటీతత్వం పెంచేందుకు ప్రైవేట్ వాహనాలకు పర్మిట్లు జారీచేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు కల్పిస్తూ కేంద్రం చట్ట సవరణ చేసింది. ఈ క్రమంలోనే కొన్ని రూట్లలో ప్రైవేట్ వాహనాలకు పర్మిట్లు ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రైవేట్ వాహనాలకు పర్మిట్లు ఇవ్వడంతో, వారు ఆదాయం కోసం తమకు కేటాయించిన రూట్లలో ఎక్కువ ట్రిప్పులు నడుపుతారని, ప్రజల రవాణా కోసం ఎక్కువ సమయం వాహనాలను అందుబాటులో ఉంచుతారని, ప్రభుత్వం భావించింది. ఫలితంగా రోడ్డు రవాణాలో ఆరోగ్యకరమైన పోటీ ఉంటుందని, ఆ క్రమంలోనే కేంద్రం చేసిన చట్టాన్ని రాష్ట్రం అమలు చేసిందని...ప్రైవేట్ బస్సులకు పర్మిట్లు ఇవ్వటానికి, ప్రైవేటీకరణకు సంబంధం లేదని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టంగా చెప్పింది. కేంద్రం తీసుకొచ్చిన చట్టం మేరకే, కొన్ని రూట్లలో ప్రైవేటు బస్సులు నడుపుకోవటానికి పర్మిట్లు జారీ చేస్తున్నామని కేసీఆర్ ప్రకటించారు. అయితే, ఈ వ్యవహారంపై పలువురు కోర్టుకు వెళ్లడంతో, చట్టం చేసింది కేంద్రమే కాబట్టి
కేంద్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రతివాదిగా చేసింది. దీంతో తప్పనిసరిగా కేంద్రం నుంచి కౌంటర్ దాఖలు చేయాల్సి ఉంటుంది. దీంతో, ఇన్ని రోజులుగా విమర్శలు చేసిన బీజేపీ.. ఇప్పుడు ఎలా తప్పించుకోవాలని ఆలోచిస్తున్నట్లు చర్చ జరుగుతోంది.