శ్రీలంక అధ్యక్ష పీఠం గోటబయ రాజపక్సనే వరించింది. అధ్యక్ష ఎన్నికల్లో ప్రతి రౌండ్లోనూ ఆధిపత్యం ప్రదర్శించిన ఆయన... సమీప ప్రత్యర్థి సజిత్ ప్రేమదాసపై విజయం సాధించారు. మరోవైపు ఆయన్ను అభినందిస్తూ
ప్రధాని మోడీ ట్వీట్ చేశారు.
శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో ఎస్.ఎల్.పి.పి అభ్యర్థి గోటబయ రాజపక్స విజయం సాధించారు. ప్రత్యర్థి ప్రేమదాసపై రాజపక్స పై చేయి సాధించారు. ఏ రౌండ్లోనూ రాజపక్సకు సరితూగలేకపోయారు ప్రేమదాస.
మొత్తం ఐదు లక్షల ఓట్లలో రాజపక్స 52.87 శాతం ఓట్లు గెలుచుకున్నారు. సజిత్ ప్రేమదాసకు 39.67 శాతం, లెఫ్టిస్ట్ అనుర కుమార దిస్సానాయకెకు 4.69 శాతం ఓట్లు దక్కినట్టు
శ్రీలంక ఎన్నికల కమిషన్ ప్రకటించింది. అధ్యక్ష ఎన్నికల్లో 80 శాతం పోలింగ్ నమోదు కాగా... 35 మంది అభ్యర్థులు పోటీ చేశారు.
గోటబయ రాజపక్స...మాజీ అధ్యక్షుడు మహీంద్ర రాజపక్స సోదరుడు. రక్షణ శాఖ కార్యదర్శిగా కూడా ఆయన పనిచేశారు. వివాదాస్పద నాయకుడిగా ఆయనకు పేరుంది. 2008-2009లో ఎల్టీటీఈని నిర్మూలించడం ద్వారా ప్రజల అభిమానం పొందారు. అయితే, తమిళ వేర్పాటువాద గెరిల్లాలతో తుది విడత పోరులో తీవ్రమైన యుద్ధనేరాలకు పాల్పడిన ఆరోపణలను ఆయన ఎదుర్కొన్నారు.
శ్రీలంకలో హోరాహోరీ పోటీ నెలకొంది. ఫలితాలు ఎలా వస్తాయోనని ప్రజలు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూశారు. చివరికి అందరూ అనుకున్నట్టుగానే జరిగింది. రాజపక్సను అధ్యక్ష పీఠం వరించింది. ఇంకేముందీ.. ఆయన అనుచరులు, అభిమానులు, కార్యకర్తల ఆనందాలకు అవధుల్లేకుండా పోయాయి. తమ నాయకుడికి అధ్యక్ష పీఠం దక్కినందుకు సంబరాలు చేసుకున్నారు. మొత్తానికి రాజపక్స ప్రజాధరణ పొందగలిగారు. తనపై అపారనమ్మకం పెట్టుకున్న ఓటర్లు ఆయనకే పట్టగట్టారు. ఎన్నికల ప్రచారంలో రాజపక్స ఏ హామీలయితే ఇచ్చారో.. అవన్నీ నెరవేస్తారని భావించిన ప్రజలు ఆయన్ను తిరిగి ఎన్నుకున్నారు. మరి రాజపక్స ఆ హామీలను నిలబెట్టుకుంటారో లేదో చూడాలి.