ఏపీలో ఎన్నికల కంటే కూడా ఇపుడు వేడి ఎక్కువగా రాజుకుంది. నిజానికి ఎన్నికలు ముగిసిన తరువాత కొన్నాళ్ల పాటు
ఏపీ ప్రశాంతంగా ఉంటుంది అనుకున్నారు, కానీ అదేంటో కానీ అన్ని పార్టీలు వీధుల్లో పడ్డాయి. మరో వైపు టీడీపీని టార్గెట్ చేస్తూ
బీజేపీ నేతలు ఆ పార్టీ నుంచి పెద్ద ఎత్తున వలసలు ఉంటాయని చెప్పడంతో అందరి ద్రుష్టి ఏపీలో టీడీపీకి ఎక్కువ ఎమ్మెల్యేలు ఉన్న
ఉత్తరాంధ్ర జిల్లాల మీద పడింది.
సహజంగానే విశాఖలో నలుగురు ఎమ్మెల్యేలు టీడీపీని గెలిచారు కాబట్టి ఇక్కడ రాజకీయాలపై ఫోకస్ ఎక్కువగా ఉంది. అది కాకుండా ఈ మధ్య చంద్రబాబు ఇసుక దీక్ష చేస్తే
విశాఖ అర్బన్ జిల్లాలో నలుగురు ఎమ్మెల్యేలు ఉంటే వారికో ముగ్గురు గైర్ హాజర్ కావడం అందరికీ షాక్ తినిపించింది. ఒక్క తూర్పు
ఎమ్మెల్యే వెలగపూడి రామక్రిష్ణ బాబు మాత్రమే బాబు దీక్షకు హాజరయ్యారు.
ఇదిలా ఉండగా వ్యక్తిగత పనుల మీదనే ఈ ఎమ్మెల్యేలు రాలేదని చెబుతున్నా ఇపుడున్న పరిస్థితుల్లో అది నమ్మదగ్గదిగా లేదని అంటున్నారు. ఇక మాజీ
మంత్రి గంటా శ్రీనివాసరావు చాలా కాలంగా
టీడీపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఆయన బాబు అదేశాలను సైతం బేఖాతర్ చేస్తున్నారు. మరో
ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్
కుమార్ పార్టీకి విధేయుడిని అని చెప్పుకుంటున్నా బాబు దీక్షకు గైర్ హాజరయ్యారు. ఇక
విశాఖ పశ్చిమ
ఎమ్మెల్యే గణబాబు తీరు మీద పుకార్లు షికారు చేస్తున్నాయి.
గణబాబు గతంలో గంటా వెంట
టీడీపీ నుంచి ప్రజారాజ్యంలోకి వెళ్ళారు. ఇపుడు కూడా గంటా బాటలో ఆయన పయనిస్తారా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇక శ్రీకాకుళం జిల్లాలో అచ్చెన్నాయుడుతో పాటు మరో టీడీపీ ఎమ్మెల్యే బెందాళం
అశోక్ గెలిచారు. అయితే ఆయన పార్టీ మారతారా అన్న చర్చ ఇపుడు సాగుతోంది. ఏది ఏమైనా
ఉత్తరాంధ్ర నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలు గేటు దాటడం ఖాయమని అధికార పార్టీలు లెక్కలు వేసుకుంటున్నాయట. ఆ ఇద్దరు ఎవరో తేలాల్సి ఉందంటున్నారు.