హైదరాబాద్ నగరంలో పదవ తరగతి చదివే బాలుడు ఏకంగా కిడ్నాప్ కు పాల్పడ్డాడు. 14 సంవత్సరాల బాలుడు మాయమాటలు చెప్పి ఏడు సంవత్సరాల బాలుడిని తన వెంట తీసుకొనివెళ్లాడు. ఆ తరువాత బాలుడి తండ్రికి ఫోన్ చేసి తన కొడుకును కిడ్నాప్ చేశానని 3 లక్షల రూపాయలు ఇస్తే తన కొడుకును వదిలేస్తానని డిమాండ్ చేశాడు. హైదరాబాద్ మీర్ పేట్ లో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. 
 
మీర్ పేట్ టీఎస్సార్ నగర్ కు చెందిన రాజు ప్రముఖ ఐటీ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా పని చేస్తున్నాడు. రాజు కొడుకు అర్జున్ ఒక ప్రైవేట్ పాఠశాలలో 1వ తరగతి చదువుతున్నాడు. నిన్న మధ్యాహ్నం 3గంటల సమయంలో ఇంటిబయట ఆడుకుంటున్న అర్జున్ కనిపించకకుండా పోయాడు. అర్జున్ అదృశ్యమైన 30నిమిషాల తరువాత అర్జున్ తండ్రి రాజుకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. 
 
ఫోన్ కాల్ లో మీ కొడుకు అర్జున్ ను కిడ్నాప్ చేశానని 3లక్షల రూపాయల డబ్బు ఇస్తే తప్ప అర్జున్ ను వదిలిపెట్టనని కిడ్నాపర్ చెప్పటంతో రాజు కంగారుపడ్డాడు. రాజు వెంటనే పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఫోన్ నంబర్ ఆధారంగా లొకేషన్ కనిపెట్టి 14 సంవత్సరాల కిడ్నాపర్ ను చూసి షాక్ అయ్యారు. కిడ్నాపర్ ను అదుపులోకి తీసుకొని పోలీసులు పోలీస్ స్టేషన్ కు తరలించారు. 
 
పోలీసులు సులువుగా డబ్బు సంపాదించాలనే ఆలోచనతో కిడ్నాపర్ కిడ్నాప్ చేసి ఉంటాడని భావిస్తున్నారు. పదవ తరగతి బాలుడైన కిడ్నాపర్ రెండు లక్షల రూపాయల నగదు కావాలని లక్ష రూపాయల చెక్ ఇచ్చినా పరవాలేదని బాలుడి తండ్రితో చెప్పాడు. సినిమాలు, నేరాల ప్రభావంతో బాలుడు ఈ కిడ్నాప్ కు పాల్పడ్డాడని తెలుస్తోంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: