పవన్ కళ్యాణ్ ఢిల్లీ టూర్ రాజకీయ వర్గాల్లో చాలా ఆసక్తిని రేపింది. పవన్ కళ్యాణ్ ఎందుకు ఢిల్లీకి వెళ్లాడనేది ఇప్పటి వరకు ఎవరికీ తెలియదు. అయితే ఏపీలో వైసీపీ సర్కారుపై తనదైన శైలి నిరసనను వ్యక్తం చేస్తున్న పవన్... సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీరుపై కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సర్కారు పెద్దలకు ఫిర్యాదు చేస్తానని చెప్పిన విషయం ఒకింత ఆసక్తి రేకెత్తించిన సంగతి తెలిసిందే కదా. అంతేకాకుండా ఢిల్లీలో పవన్ ల్యాండ్ కాగానే బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతో భేటీ అవుతారని - వీలును బట్టి ప్రధాని నరేంద్ర మోదీతోనూ పవన్ భేటీ అవుతారని వార్తలు వినిపించాయి. అదే టెంపోతోనే ఢిల్లీ ఫ్లైట్ ఎక్కిన పవన్... ఇప్పటిదాకా తాను ఎవరెవరిని కలిశాను? అన్న వివరాలపై అసలు మాటమాత్రంగా కూడా మాట్లాడలేదు.


ఇటువంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ ఢిల్లీకి ఎందుకు వెళ్లాడనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అయినా పవన్ ఢిల్లీలో ల్యాండయ్యారా? లేదంటే ఆయన అసలు ఢిల్లీ గడపే తొక్కలేదా? అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం పవన్ అసలు ఢిల్లీ గడపే తొక్కలేదన్న వార్తలు వినిపిస్తున్నాయి. పేరుకు ఢిల్లీ పర్యటనే అయినా... పవన్ ఢిల్లీ అవుట్ స్కట్స్ లోని నోయిడాలో మకాం వేశారని - నోయిడా పరిధిలోని ఓ హోటల్ లోనే బస చేశారని తెలుస్తోంది. జనసేన ప్రకటన కూడా పవన్ ఢిల్లీ పర్యటన.. పూర్తిగా వ్యక్తిగతమేనని - ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాలుపంచుకునేందుకు పవన్ అక్కడికి వెళ్లారని చెప్పని సంగతి తెలిసిందే.


కానీ పవన్ కళ్యాణ్ పర్యటన రాజకీయాలకు ముడి పడి ఉందని ప్రచారం అయితే గట్టిగా సాగింది. అయితే పవన్ హాజరవ్వాల్సిన ప్రైవేట్ కార్యక్రమం ఇప్పటికే పూర్తి అయినా కూడా పవన్ ఇంకా అక్కడే ఎందుకు ఉన్నారన్న వాదనలూ ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. ఢిల్లీలో పవన్ కు ఇప్పటిదాకా అమిత్ షా గానీ - మోదీ గానీ - ఇతర కేంద్ర మంత్రుల అపాయింట్ మెంట్ లేవీ లభించలేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వారి అపాయింట్ మెంట్ల కోసమే నోయిడాలో వెయిట్ చేస్తున్న పవన్... ఢిల్లీకి దూరంగానే ఉంటున్నారట. అంతేకాకుండా తాను ఎవరెవరిని కలిశాను? అన్న విషయాలు బయటకు పొక్కకుండా ఉండేలా కూడా పవన్ నోయిడాను ఎంచుకున్నట్లుగా తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: