తెలంగాణాలో ఆర్టీసీ రగడ కొనసాగుతూనే ఉంది. ఎవరికి వారే ఏక పక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇక ఆర్టీసీ ఐకాస కన్వీనర్ ఇ.అశ్వత్థామరెడ్డి, కో కన్వీనర్ కె.రాజిరెడ్డి రెండు రోజులుగా నిరాహార దీక్షలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇకపోతే పోలీసులు నిన్న ఆర్టీసీ కార్మిక సంఘాల ఐకాస కన్వీనర్ అశ్వత్థామరెడ్డి దీక్షను భగ్నం చేసి ఉస్మానియా ఆస్పత్రికి తరలించిన విషయం కూడా తెలిసిందే.
తమ డిమాండ్లు పరిష్కరించే వరకూ దీక్ష కొనసాగుతుందని తెలుపుతూ ఆయన ఆస్పత్రిలోనే దీక్షను కొనసాగిస్తున్నారు. ఇక అశ్వత్థామను ఉస్మానియా ఆస్పత్పిలో దీక్ష కొనసాగిస్తున్న విషయం తెలిసిన పలువురు రాజకీయ, ఆర్టీసీ ఐకాస నేతలు హస్పిటల్కు వెళ్లి పరామర్శిస్తున్నారు. ఈ సందర్భంగా ఈరోజు ఉదయం తెజస అధ్యక్షుడు కోదండరామ్ ఆయనను పరామర్శించి, ఆర్టీసీ సమ్మెపై ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును ఖండించారు.
ఇకపోతే సమ్మెతో తమ డిమాండ్లకు ప్రభుత్వం స్పందించడం లేదని ఆర్టీసీ కార్మిక సంఘాల ఐకాస నేతలు నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ దీక్షలను పోలీసులు ఆదివారం భగ్నం చేయదమే కాకుండా వివిధ సంఘాల నేతలు ధర్నాచౌక్లో నిర్వహించ తలపెట్టిన మహాదీక్ష యత్నాన్ని కూడా పోలీసులు అడ్డుకున్నారు. అంతే కాకుండా దీక్షలకు పోలీసులు అనుమతించకపోవడంతో అశ్వత్థామరెడ్డి స్వీయగృహ నిర్బంధాన్ని విధించుకుని నిరాహార దీక్ష చేపట్టారు.
మరోవైపు మధుమేహం, రక్తపోటుతో బాధపడుతున్న అశ్వత్థామరెడ్డికి, ఇప్పుడున్న పరిస్థితుల్లో తక్షణ వైద్యం అందించకపోతే ప్రాణానికే ముప్పు అని ఆర్ఎంవో రాజ్కుమార్ వెల్లడించారు. అంతే కాకుండా అశ్వత్థామరెడ్డి ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తుండటంతో వైద్యానికి సహకరించాలని డాక్టర్లు కోరారు. ఈ మేరకు ఆదివారం రాత్రి 10.30 గంటల సమయంలో ఆయనకు సెలైన్ ఎక్కించినట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ఇక ఈ దీక్షల వల్ల ఎలాంటి ఫలితం వస్తుందో అనుకుంటున్నారు ప్రజలు.