తెలంగాణలో ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో విచారణ ముగిసింది. సమ్మెపై రెండు వారాల్లోగా నిర్ణయం తీసుకోవాలని కార్మికశాఖ  కమిషనర్‌ను హైకోర్టు ఆదేశించింది. కార్మిక న్యాయస్థానికి వెళ్లాలా? లేదా? అనేది రెండు వారాల్లోగా నిర్ణయించాలని కార్మికశాఖ కమిషనర్‌కు సూచించింది. సమ్మె చట్టబద్దమా? వ్యతిరేకమా? నిర్ణయించే అధికారం లేబర్‌ కోర్టుకు ఉందని న్యాయస్థానం స్పష్టం చేసింది.


ఆర్టీసీ సమ్మెపై తెలంగాణ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ అంశాన్ని కార్మిక న్యాయస్థానం చూసుకుంటుందని హైకోర్టు తెలిపింది. రెండు వారాల్లో సమస్య పరిష్కారమయ్యేలా చూడాలని కార్మిక శాఖ కమిషనర్‌కు సూచించింది. కేసు విచారణ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సమ్మె చట్టవిరుద్ధమని ఆదేశించలేమని ప్రభుత్వానికి తేల్చి చెప్పింది. సమ్మె లీగల్‌, ఇల్లీగల్‌ అని చెప్పే అధికారం లేబర్‌ కోర్టుకు మాత్రమే ఉంటుందని అభిప్రాయపడింది.  


ప్రభుత్వంతో చర్చల కమిటీ వేయాలని ఆర్టీసీ జేఏసీ కోరగా.. కమిటీ వేయడానికి ప్రభుత్వం సిద్ధంగా లేదని ధర్మాసనం తేల్చిచెప్పింది. ప్రభుత్వ అభిప్రాయంతో సంబంధం లేకుండా కమిటీ వేయాలని ఆర్టీసీ జేఏసీ కోరింది. 45 రోజులుగా కార్మికులు సమ్మె చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ధర్మాసనానికి వివరించారు. జీతాలు లేక కుటుంబ పోషణ భారం అవుతుందన్నారు. ప్రభుత్వం మాత్రం తాత్కాలిక డ్రైవర్లతో బస్సులు నడిపిస్తూ యాక్సిడెంట్లు చేయిస్తుందని హైకోర్టుకు వివరించారు. ఈ విషయం లేబర్‌ కోర్టు చూసుకుటుందని, తాము ప్రభుత్వానికి ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమని హైకోర్టు అభిప్రాయపడింది.


ఇరు వర్గాల వాదనలు విన్న ధర్మాసనం.. తమ ముందు రెండు అంశాలు మాత్రమే ఉన్నాయంది. మొదటిది సమ్మె చట్ట విరుద్ధమని ప్రకటించాలని, కానీ ఆ అధికారం లేబర్ కోర్టుకే ఉందని తేల్చిచెప్పింది. రెండోది కార్మికులను చర్చలకు పిలవమని ప్రభుత్వాన్ని ఆదేశించాలనీ ఆ అధికారం తమకు ఉందో లేదో చెప్పమని మొదట్నుంచీ అడుగుతున్నామంది. హైదరాబాద్‌, సికింద్రాబాద్‌లలో బస్సులు లేకపోయినా మెట్రోలో ప్రజలు ప్రయాణం చేస్తున్నారన్న హైకోర్టు.. గ్రామీణ ప్రాంతాల్లో బస్సుల్లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: