మొన్నటి వరకు ఏపీలో ఇంగ్లీష్ మీడియం రగడ జరిగింది. ఇప్పుడు ఆ సెగ పార్లమెంట్ కు తాకింది. టీడీపీకి ఉన్న ముగ్గురు ఎంపీలు మాట్లాడినా పెద్ద ఎఫెక్ట్ కనిపించలేదు. లోక్ సభ ప్రారంభం కాగానే ప్రతిపక్షాలు ఆందోళనకు దిగగా గందరగోళం మధ్యే ప్రశ్నోత్తరాలు కొనసాగాయి. ఆ సమయంలో టీడీపీ ఎంపీ కేశినేని నాని మాట్లాడుతూ.. ఏపీలో జగన్ ప్రభుత్వం ఇంగ్లీష్ మీడియం బోధనను తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకుందని.. దాని వల్ల ప్రాంతీయ భాషల పరిరక్షణకు విఘాతమేర్పడుతుందని అన్నారు. కేవలం ఇంగ్లిష్ మీడియం రుద్దకుండా  త్రిభాషా విధానాన్ని అమలు చేయాలని అన్నారు. ఆ సమయంలోనూ లోక్ సభ గందరగోళంగా ఉండగా.. వైసీపీ సభ్యుడు రఘురామకృష్ణంరాజు లేచి జగన్ తీసుకున్న నిర్ణయం  పేద విద్యార్ధులకు మేలు చేస్తుందని చెప్పారు. 


ఇంకా చెబుతూ ఇంగ్లీష్ తో పాటు తెలుగును కూడా కచ్చితం చేస్తున్నామని చెప్పారు. ఒకటి నుండి ఆరో తరగతి వరకు ఇంగ్లీషు మీడియం అమలు చేస్తూనే తెలుగు తప్పనిసరి చేసిన విషయాన్ని సభకు వివరించారు. ఏపీ ప్రబుత్వం తెలుగు భాషకేమీ అన్యాయం చేయడం లేదని ఇప్పటికే ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ పార్వతి ఛైర్ పర్సన్ గా తెలుగు అకాడమి.. అదే విధంగా తెలుగు అధికార భాష సంఘం ఛైర్మన్ గా యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ ను నియమించినట్లు చెప్పారు.


అయితే పార్లమెంట్ లో టీడీపీకి ఉన్నది ముగ్గురే ఎంపీలు కనుక గట్టిగా వాదించలేకపోయారు. కేశినేని నాని - రఘురామకృష్ణంరాజు మాట్లాడిన తరువాత కేంద్ర మానవ వనరుల మంత్రి మాట్లాడుతూ తెలుగు భాష కోసం కేంద్రం ఏం చేసిందో చెప్పుకొచ్చారు. మైసూరులోని సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ లాంగ్వేజెస్ (సీఐఐఎల్) అధీనంలో ఉన్న తెలుగు క్లాసికల్ అభివృద్ధి సంస్థను నెల్లూరుకు మార్చిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రాంతీయ భాషలను పటిష్ఠం చేయాలనే ఆలోచనతో ప్రభుత్వం ఉందని ఇందుకోసం మైసూరులోని సంస్థను నెల్లూరుకు మార్చారు పోఖ్రియాల్ తెలిపారు. ఈ సంస్థ నవంబరు 13 నుంచి పనిచేయడం ప్రారంభించిందని వివరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: