టీడీపీ పార్టీ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయి .. నానా తంటాలు పడుతుంది. అయితే మరో పక్క పార్టీలో ఉన్న నేతలందరూ వేరే పార్టీలకు క్యూ కడుతున్నారు. దీనితో వారిని ఎలా నిలువరించాలో తెలియక పార్టీ అధినేత చంద్రబాబు చాలా కష్టాలు పడుతున్నారు. ఇప్పటికే నలుగురు రాజ్యసభ సభ్యులు బీజేపీలోకి చేరిపోగా... పార్టీకి గట్టి పట్టున్న కృష్ణా జిల్లాలో గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ భారీ దెబ్బ కొట్టేశారు. వంశీ కొట్టిన దెబ్బకు విలవిల్లాడిపోతున్న టీడీపీకి త్వరలో మరో భారీ దెబ్బ తప్పదంటూ ఓ ఆంగ్ల దినపత్రిక ఓ సంచలన కథనాన్ని ప్రచురించింది. ఈ కథనం ప్రకారం వచ్చే రెండు వారాల్లోనే ఏకంగా ముగ్గురు ఎమ్మెల్యేలు సహా మరో ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు పార్టీని వీడనున్నారట. ఇదే జరిగితే... ఇప్పటికే నేతలను నిలువరించలేక నానా తంటాలు పడుతున్న టీడీపీకి మరో భారీ ఎదురు దెబ్బ తగిలినట్టేనన్న వాదన వినిపిస్తోంది.

 

అయితే ఇప్పటికే వల్లభనేని వంశీ, దేవినేని అవినాష్ పార్టీ మారి టీడీపీకి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. అయితే తాజాగా ఆంగ్ల పత్రిక కథనం ప్రకారం... టీడీపీని వీడనున్న ఎమ్మెల్యేల్లో విశాఖ జిల్లాకు చెందిన పార్టీ సీనియర్ నేత - మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుతో పాటు అదే జిల్లాకు చెందిన మరో ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారట. ఇప్పటికే బీజేపీ నేతలతో మంతనాలు సాగించిన గంటా త్వరలోనే టీడీపీని వీడి కమలం గూటికి చేరతారని సదరు పత్రిక తెలిపింది. తానొక్కడే కాకుండా తన వెంట మరో ఇద్దరు ఎమ్మెల్యేలను కూడా గంటా తన వెంటబెట్టుకుని వెళతారని కూడా ఆ పత్రిక పేర్కొంది. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ తో ఇప్పటికే గంటా భేటీ అయ్యారని - పార్టీలో చేరికకు బీజేపీ నుంచి గంటా బ్యాచ్ కు గ్రీన్ సిగ్నల్ కూడా వచ్చేసిందని సదరు కథనం పేర్కొంది.



ఇక మిగిలింది వీరందరూ పార్టీ మారడమే తరువాయి భాగమని తెలుస్తుంది. ఇదిలా ఉంటే... గంటా పార్టీని వీడిన మరుక్షణమే గుంటూరు జిల్లాకు చెందిన ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు కూడా టీడీపీకి గుడ్ బై చెప్పనున్నారట. వీరి పేర్లను ప్రస్తావించని సదరు పత్రిక... టీడీపీకి షాకివ్వనున్న ఆ ఇద్దరు నేతలు గుంటూరు జిల్లాలో పార్టీకి కీలక నేతలుగానే కాకుండా రాష్ట్రస్థాయిలో మంచి గుర్తింపు కలిగిన నేతలుగానే పేర్కొంది. అయితే వారు ఎవరన్న విషయాన్ని మాత్రం సదరు ఆంగ్ల పత్రిక పేర్కొనలేదు. మొత్తంగా ముగ్గురు ఎమ్మెల్యేలు - మరో ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు కేవలం రెండు వారాల్లోనే పార్టీ వీడనున్నారంటూ సదరు పత్రిక ప్రచురించిన కథనం టీడీపీ శ్రేణులను కలవరానికి గురి చేసిందనే చెప్పక తప్పదు.

మరింత సమాచారం తెలుసుకోండి: