ప్రేమ, ప్రేమవివాహల నేపథ్యంలోజరిగే హత్యలు దేశంలో విపరీతంగా పెరిగిపోయినట్లు నేషనల్ క్రైం బ్యూరో రిపోర్టులో వెల్లడైంది. 2017వరకు నివేదించిన ఈ రిపోర్టులో అనేక ఆసక్తికర విషయాలున్నాయి. గత పదిహేనేళ్లుగా దేశంలో క్రైంలో చేసుకుంటున్న అంశాల గురించి ఈ రిపోర్టులో విశ్లేషించారు. దాని సారాంశం ఏమిటంటే.. అత్యధికంగా హత్యలు జరుగుతున్నది ప్రేమ వ్యవహారాల వల్లనేనని తేలింది. గతంతో పోలిస్తే దేశంలో ఇతర కారణాలతో జరిగే హత్యలు బాగా తగ్గుముఖం పట్టాయని నివేదికలో పేర్కొంది.
రెండు వేల పదిహేడులో దాదాపు ఇరవై ఎనిమిది వేల హత్యలు దేశంలో జరిగాయని వెల్లడైంది. సామాజిక మార్పులు..యువతకు లభిస్తున్న స్వేచ్ఛతో ప్రేమలు..పెళ్లిలు జరుగుతున్నాయి. ఇక్కడే మోసాలు..మోసపుచ్చడాలు జరుగుతున్నాయి. ఇవి కొంతమందిని ఆవేశానికి లోను చేసి ప్రియురాలినో లేదా ప్రియుడినో హత్య చేసేలా లేదా చేయించేల పురిగొలుపుతున్నాయి. ఈ సంఘటనలు ఇటీవల కామన్ అయిపోయాయి.
అదే సమయంలో ప్రేమ వివాహాలకు కుల, మత, వర్గ వైషమ్యాల కారణంగా పెద్దలు అడ్డుచెబుతున్నారు. దీంతో చాలాచోట్ల పరువు హత్యలు పెరిగిపోతున్నాయి. ఇవేకాక పెళ్లాయ్యక వివాహేతర సంబంధాల నేపథ్యంలో భార్యను భర్త చంపడం లేదా. భర్తను భార్యచంపడం లాంటి ఘటనలు అనేకం నమోదవుతున్నాయి. వీటన్నింటిని కూడా క్రైం బ్యూరో ప్రేమ, కుటుంబ కలహాల నేపథ్యంలో సాగుతున్న హత్యలుగా నివేదికలో పేర్కొనడం గమనార్హం.
ఇలా దేశంలో హత్యలకు కారణాల్లో ప్రేమ ప్రముఖంగా ఉంటోందని ఈ నివేదికలో వివరించారు. ఇక వ్యక్తిగత కక్షలతో జరిగే హత్యలు - ఆస్తుల కోసం జరిగే హత్యలు చాలా వరకూ తగ్గాయని ఈ రిపోర్టు విశ్లేషించింది. పరువు హత్యలు మాత్రం పెరుగుతున్నాయని పేర్కొంది. మొత్తంగా ఇండియాలో హత్యలకు ప్రేమే కారణమవుతోందని పోలీసుల నివేదిక తేల్చేసింది. ఆధునిక సమాజంలో పెరుగుతున్న పెడధోరణులు ఇంకెన్ని ఘోరాలు..నేరాలకు దారితీస్తాయోనని సామాజిక వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.