ఢిల్లీ అంటే మన దేశ రాజధాని. ఢిల్లీ అంటే మనందరి ప్రధాన నగరం. ఢిల్లీ అంటే రాజకీయ ముఖ్య కేంద్రం. ఢిల్లీ అంటే దేశానికి వెన్నెముక. ఢిల్లీ అంటే పరిపాలనకు ముఖ్య కేంద్రం. ఇలా ఢిల్లీ గురించి చాలా చెప్పుకోవాలి. ఢిల్లీ అంటే పురాణాల్లోకి వెళ్తే హస్తిగాపురిగా చెబుతారు. అంటే భారతంలో పాండవులు, కౌరవులు ఏలిన ప్రాంతం. మరి ఇంతటి ప్రాముఖ్యత గల మరో నగరం దేశంలో ఎక్కడైనా ఉంటుందా.
అంటే ఉంటుంది అంటున్నారు ఇపుడు మన పర్యావరణ శాస్త్రవేత్తలు. ఢిల్లీ అంటే ఇపుడు వారి మాటల్లో చెప్పుకోవాలంటే కాలుష్యనగరం. కలికాలపు యుగం. ఢిల్లీ అంటే గాలి కూడా కొనుక్కునే నరకప్రాయమైన నగరం. ఢిల్లీ అంటే బతకాడానికి కూడా బెంబేలెత్తే నగరం. మరి ఈ లక్షణాలు దేశంలో చాలా నగరలాకు వ్యాపిస్తున్నాయట. అటువంటి వాటిలో దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్య నగరాలతో పాటు, ప్రధానమైన మెట్రో నగరాల్లో కూడా ఢిల్లీ కి మించే కాలుష్యం ఉందిట. అంటే ఢిల్లీని ఏ విషయంలోనైనా మించకపోయినా కాలుష్యంలో మాత్రం పోటీ పడే నగరాలు చాలానే ఉన్నాయన్నమాట.
ఇక ఏపీ విషయానికి వస్తే రెండు నగరాలు ఢిల్లీతో పోటీ పడుతున్నాయట. అవి విజయవాడ, విశాఖపట్నం. కాలుష్యపు కోరల్లో చిక్కుకుని విజయవాడ విలవిల్లాడుతూంటే, విశాఖపట్నం కూడా తరువాత ప్లేస్ లో ఉందిట. ఢిల్లీలో నాణ్యమైన గాలి దొరకక ఆక్సిజన్ బార్లకు అక్కడ డిమాండ్ పెరుగుతోంది. ఇపుడు అదే పరిస్థితికి కాస్త దగ్గరలోనే ఈ రెండు నగరాలు ఉన్నాయని అంటున్నారు.
పారిశ్రామిక కాలుష్యంలో పాటు, ట్రాఫిక్ ఎక్కువగా పెరిగిపోవడంతో ఈ నగరాలు కాలుష్య కాసారాలుగా మారుతున్నాయని అంటున్నారు. అదే విధంగా ఈ నగరాల్లో పచ్చని చెట్లు కూడా కనుమరుగు అవుతున్నాయట. దాంతో ఈ నగరాల్లో అన్ని కాలాలూ వేసవి కాలాలు అవుతున్నాయని, వేసవి తాపం పెరిగిపోయి ప్రక్రుతి విలయాలకు ఆస్కారం ఏర్పడే అవకాశాలు కూడా ఉన్నాయని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు.
ఇదిలా ఉండగా విజయవాడలో వాయు కాలుష్యం దారుణంగా పెరిగిపోతోందని, నియంత్రణకు తగిన చర్యలు తీసుకోవాలని జాతీయ హరిత ట్రిబునల్ తాజాగా ఆదేశాలు జారీ చేసింది. కాలుష్య కారకాలు అయిన పెద్ద పరిశ్రమలకు కోటి రూపాయలు, మధ్య తరహా పరిశ్రమలకు 50 లక్షల రూపాయలు జరీమానా విధించాలని ట్రిబ్యునల్ ఆదేశించింది.