ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్రైస్తవులకు శుభవార్త చెప్పిన సంగతి తెలిసిందే. జెరుసలేం యాత్రకు వెళ్లే క్రైస్తవులకు ప్రభుత్వ ఆర్థిక సాయం పెంచడం ద్వారా జగన్ సర్కారు వారికి గుడ్ న్యూస్ అందించింది. జెరుసలేంతో పాటు పవిత్ర గ్రంథం బైబిల్ లో పొందుపరచిన పవిత్ర ప్రదేశాల యాత్రకు వెళ్లే క్రైస్తవులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇచ్చే ఆర్థిక సహాయాన్ని పెంచుతూ మంగళవారం ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. G.O. MS. 74, Minorities Welfare (SMD) Department, Dt: 19/11/2019ను విడుదల చేసింది.
గత కేబినెట్ సమావేశంలో ఆర్ధిక సాయం పెంపుపై నిర్ణయం తీసుకున్న జగన్ సర్కార్..ఇప్పుడు కేబినెట్ నిర్ణయాలను అమలు చేస్తూ ఉత్తర్వులు విడుదల చేసింది. ఈ మేరకు ఆదేశాలు విడుదల చేసింది. జెరూసలేం యాత్ర కు పెరిగిన సర్కారీ సహాయం ప్రకారం వార్షిక ఆదాయం మూడు లక్షల కన్నా తక్కువగా ఉన్న వారికి 40 వేల నుండి 60వేలకు, అదేవిధంగా మూడు లక్షల కన్నా ఎక్కువగా ఉన్న వారికి 20 వేల నుండి 30 వేలకు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలలో పొందుపరిచింది. ఇతర వివరాలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రైస్తవ (మైనార్టీ) ఫైనాన్స్ కార్పొరేషన్ కార్యాలయాన్ని (లేదా) జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారుల కార్యాలయాన్ని సంప్రదించవచ్చు. కాగా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్.బి.అంజాద్ బాషా కోరారు. ఈ మేరకు రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి వారి కార్యాలయం పత్రికా ప్రకటన విడుదల చేసింది.
కాగా, తాజా నిర్ణయంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాలనలో క్రైస్తవులకు పెద్దపీట వేసినట్లయిందని అంటున్నారు. అయితే, సహజంగానే ముఖ్యమంత్రి జగన్ సర్కారు నిర్ణయంపై పలువురు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఏపీలో ప్రభుత్వ పాఠశాలలో తెలుగు మీడియంను ఎత్తివేసి ఆంగ్ల మీడియంలో బోధన ప్రారంభించడం వెనుక కూడా క్రైస్తవ మతం ప్రచారం కోణం ఉందనే ఆరోపణలు ఉన్నప్పటికీ...జెరూసలేం యాత్రకు చేసే సాయాన్ని పెంచుతూ ఏపీ సర్కారు నిర్ణయం తీసుకోవడం గమనార్హం.