సూపర్స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లోకి `పాక్షికంగా` అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. 2017 డిసెంబర్లో రాజకీయ అరంగేట్రం చేసినా పార్టీ స్థాపనపై రజనీకాంత్ ఇంకా మీనమేషాలు లెక్కిస్తున్నారు. అప్పుడప్పుడూ సంచలన వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో వ్యక్తిగా నిలుస్తున్నారు. తాజాగా, కమల్హాసన్ 60 ఏళ్ల సినీ ప్రస్థానం సందర్భంగా ఆదివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో
రాజకీయాల్లో అద్భుతాలు, విచిత్రాలు జరుగుతుంటాయని తమిళనాడు సీఎం పళనిస్వామి ప్రభుత్వాన్ని ఉద్దేశించి సూపర్స్టార్ రజనీకాంత్ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై అన్నాడీఎంకే కౌంటర్ అటాక్ చేసింది. అసలు మీరు సూపర్ స్టార్ అవుతారని కలలు కన్నారా? అంటూ ఘాటుగా కౌంటర్ ఇచ్చింది.
కమల్ కార్యక్రమంలో రజనీ మాట్లాడుతూ..రాజకీయాల్లో అద్భుతాలు, విచిత్రాలు జరుగుతాయని అన్నారు. `` పళనిస్వామి సీఎం అవుతారని ఎవరనుకున్నారు. పళనిస్వామి సీఎం అయిన తర్వాత కూడా 20 రోజుల్లో ఆయన ప్రభుత్వం కూలిపోతుందనుకున్నారు. ఐదారు నెలల కన్నా ఎక్కువ రోజులు ప్రభుత్వం నడవదనుకున్నారు. కానీ కొన్ని అద్భుతాల వల్ల పళనిస్వామి సీఎంగా రెండేళ్లు పూర్తి చేసుకున్నారు` అని వ్యాఖ్యానించారు. దీనిపై అన్నాడీఎంకే తాజాగా స్పందిస్తూ, మీరు (రజనీకాంత్) సూపర్స్టార్ అవ్వాలని కలలు కనేవారు కాదని, బస్ కండక్టర్గా జీవితాన్ని ప్రారంభించిన తర్వాత స్టార్ అయ్యారని పార్టీ పేర్కొంది. ఎడప్పడి పళనిస్వామి తెరపై వ్యక్తి కాదని, ఎన్నికల్లో ప్రజల మద్దతును గెలిచి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించిన వ్యక్తి అని రజనీకాంత్ వ్యాఖ్యలకు ధీటుగా కౌంటర్ ఇచ్చింది. మొత్తంగా...రజనీ ప్రైవేట్ కార్యక్రమంలో కామెంట్లు చేసి...కౌంటర్లు తిన్నారని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
రాజకీయాల్లో ఎప్పుడు ఏమైనా జరగవచ్చనే ఉదాహరణకు తమిళనాడు రాజకీయాలే నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఇలాంటి తరుణంలో రాబోయే రోజుల్లో ఆశ్చర్యకరమైన పరిణామాలూ చోటుచేసుకుంటాయని రజనీ చేసిన వ్యాఖ్యల వెనుక మర్మం ఏంటని ఇప్పటికే రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి.