కొన్ని సార్లు మనం మాట్లాడిన మాటలే మనకు రివర్స్ తగులుతుంటాయి. ఇప్పుడు చంద్రబాబుకు కూడా అలాంటి పరిస్థితే ఎదురైంది. గెలిచిన వారిని పులులతో పోల్చిన చంద్రబాబు తన కొడుకు లోకేష్ ను కార్నర్ చేయించుకున్నారు. మొన్నటిదాకా అసలు ఎన్నికల్లో తమ పార్టీ ఎందుకు ఓడిపోయిందో తెలియదంటూ చాలా రోజుల పాటు బహిరంగంగానే వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు... ఇన్ని తక్కువ సీట్లకే పరిమితమయ్యేంత తప్పు తానేం చేశానంటూ కూడా మదనపడిన తీరు నిజంగానే ఆసక్తి రేకెత్తించింది. అయితే అవే మాటలను ఎన్ని రోజులని చెబుతారు? అందుకే కాబోలు... ఆ మాటలను వదిలేసిన చంద్రబాబు... ఇప్పుడు కొత్త మాటలు అందుకుని - వాటితోనూ డంగైపోతున్నారు. ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనలో ఉన్న చంద్రబాబు.. మంగళవారం చేసిన ఓ కామెంట్ వైరల్ గా మారిపోయింది.

 

మొన్నటి ఎన్నికల్లో టీడీపీ తరుపున 175 మంది పోటీ చేస్తే కేవలం 23 మంది మాత్రమే గెలిచారు. ఇదే విషయాన్ని ప్రస్తావించిన చంద్రబాబు... ఎన్నికల్లో విజయం సాధించిన ఆ 23 మందిని పులులుగా అభివర్ణించారు. ఇక్కడే ఓ ప్రశ్న ఆయన ముందుకు చాలా స్పీడుగానే దూసుకువచ్చింది. గెలిచినోళ్లు పులులు అయితే.. మరి ఓడిన వాళ్ల మాటేమిటి? అన్నదే ఆ ప్రశ్న. అంతేకాదండోయ్... ఆ ఓడిన వాళ్లలో తన కుమారుడు - పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కూడా ఉన్నారు కదా. గెలిచినోళ్లు పులులు అయితే... ఓడిన లోకేశ్ ను ఏమంటారు? అంటూ చంద్రబాబును ఆయన రాజకీయ ప్రత్యర్థులు ప్రశ్నిస్తున్నారు.



అయితే చంద్రబాబుకు  ఇప్పుడు ఈ పులులు గోల అవసరమా అని సందేహం రాక మానదు. అయినా ఈ పులుల గోల చంద్రబాబు నోట నుంచి ఎలా వచ్చిందన్న విషయానికి వస్తే... గన్నవరం నుంచి పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగి గెలిచి నిలిచిన వల్లభనేని వంశీమోహన్ ఇప్పుడు వైసీపీ దరి చేరుతున్నారు కదా. ఈ విషయాన్ని ప్రస్తావించిన చంద్రబాబు... గెలిచిన 23 మంది పులుల నుంచి ఓ పులి వెళ్లిపోయిందని - అయినా పార్టీ నేతలు బెదరాల్సిన అవసరం లేదని చెప్పుకొచ్చారు. పార్టీ కేడర్ లో ధైర్యం నూరిపోసే దాకా అయితే ఓకే గానీ... ఇలా కొత్త కొత్త డౌట్లు క్రియేట్ అయ్యేలా చేసే వ్యాఖ్యలతోనే ఇబ్బంది. ఈ విషయాన్ని చంద్రబాబు ఎప్పుడు గుర్తిస్తారోనన్న దిశగా విశ్లేషణలు అప్పుడే మొదలైపోయాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: