మంత్రి కొడాలినాని భాష, ప్రవర్తనచూసి రాష్ట్రప్రజలంతా సిగ్గుతో తలొంచుకుంటున్నారని , వైసీపీ శాసనసభ్యులను, శాడిస్టు సభ్యులుగా భావిస్తున్నారని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పిల్లి మాణిక్యరావు ఆగ్రహం వ్యక్తంచేశారు. శాసససభ్యుడిగా ఎన్నికై, మంత్రి పదవిపొందిన నాని కంటే, చదువుసంధ్యలు లేనివాళ్లు ఎంతోసభ్యత, సంస్కారంతో మాట్లాడతారన్నారు.    కొడాలినాని భాష, ప్రవర్తనతోపాటు, కొందరు మంత్రులు నిర్లజ్జగా వ్యవహరిస్తున్న తీరుపై  ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి, రాష్ట్రప్రజలకు సమాధానం చెప్పాలని మాణిక్యరావు డిమాండ్‌ చేశారు. 


తనకేబినెట్‌లో ఉన్న మంత్రులు ఇష్టానుసారం నోరుపారేసుకుంటుంటే, సీఎం పదవిలో ఉన్న జగన్‌, చోద్యం చూస్తూ ఏమీపట్టనట్లుగా ఉండటం ఆయనకు భావ్యంకాద న్నారు. ప్రజలతరపున మాట్లాడేవారిపై నోరుపారేసుకోవడం, ఉచ్ఛనీచాలు మరిచిమాట్లాడ టం తప్ప, మంత్రులకు పాలనాపరమైన అంశాలపై అవగాహనలేకుండా పోయిందన్నారు. ప్రపంచవ్యాప్తంగా పవిత్రక్షేత్రంగా పేరొందిన తిరుమల గురించి నీచంగా మాట్లాడిన మంత్రి కొడాలి వ్యాఖ్యలపై, ముఖ్యమంత్రి మౌనంగా ఉన్నాడంటే, ఆయనకూడా కొడాలి వ్యాఖ్యలను సమర్థిస్తున్నాడనే అనుకోవాల్సి వస్తుందన్నారు. 


బూతుపురాణం, అసభ్యప్రవర్తన  తెలిసినవారిని ఏరికోరిమరీ జగన్‌ మంత్రులుగా ఎంపికచేసినట్లుందని పిల్లి ఎద్దేవాచేశారు. టీడీపీ యువనేత లోకేశ్‌ని ఉద్దేశించి పప్పు అని, ఆయనకు మాట్లాడటం రాదని ప్రచారం చేస్తున్న వైసీపీమంత్రులు, ఎమ్మెల్యేలు ఆయనలోని గొప్ప ప్రవర్తన, హుందాతనం, సభ్యత, సంస్కారాలను చూసి సిగ్గుపడాలన్నారు. పప్పుకంటే, చిప్పకూడు ఇంకా దారుణమని, జైలుకెళ్లినవారికి ఆ కూటి విలువబాగా తెలుసునని మాణిక్యరావు దెప్పిపొడిచారు. టీడీపీనేత లు సన్నబియ్యంపై ప్రశ్నించారన్న అక్కసుతో బూతుపురాణం పఠించిన నాని, త్వరలోనే ప్రజలచేతిలో దారుణ పరాభవం చవిచూస్తారన్నారు. సన్నబియ్యంపై మాటతప్పిన నాని, అసెంబ్లీకి ఎలాంటి అవతారంతో వెళ్తున్నాడో, అక్కడ ఎలా ప్రవర్తిస్తున్నాడో ఆయనే ఆలోచించుకోవాలన్నారు. కొన్ని రోజుల క్రితం కొడాలి నాని ప్రెస్ మీట్ నిర్వహించి తెలుగుదేశం పార్టీపై విరుచుకుపడిన సంగతి తెలిసిందే.  నాని ఆ ప్రెస్ మీట్ లో వాడిన భాష దారుణంగా ఉన్నది.  ఎంత కోపం ఉన్నా సరే శాసనసభ్యుల హోదాలో ఉండి అలా మాట్లాడితే సామాన్యులు ఏమనుకుంటారు.. రాజుబాటలోనే ప్రజలు కూడా నడవాలని చెప్పి ప్రజలు కూడా అలానే మాట్లాడటం మొదలుపెడితే ఇక రాష్ట్రం భవిష్యత్తు ఎలా ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు.  

మరింత సమాచారం తెలుసుకోండి: