డబ్బుకోసం ఎంతకైనా తెగిస్తున్నారు కొందరు దుర్మార్గులు. చివరకు కట్టుకున్న పెళ్లాన్నే కాసుల కోసం ఎరగా వేశాడో నీచాతి నీచుడు. తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన హానీ ట్రాప్ ఇన్సిడెంట్లో కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి.
హనీట్రాప్ .. డబ్బున్న వాళ్లకు వలపు వల విసిరి వారిని బ్లాక్మెయిల్ చేయడం. ముంబై, ఢిల్లీ, హైదరాబాద్ లాంటి నగరాల్లో జడలు విప్పుకున్న ఈ హానిట్రాప్ ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లాలోకి ఎంటరైంది.జిల్లాకు చెందిన వ్యక్తిని యువతితో ట్రాప్ చేయించి ఘరానా మోసానికి పాల్పడడం ఇప్పుడు పెద్ద సంచలనం సృష్టించింది.
హానీట్రాప్ ముఠాకు చెందిన రాకేశ్ భార్య అశ్వినితో.. గొల్లలమామిడాడకు చెందిన ఫైనాన్స్ వ్యాపారి మణికంఠరెడ్డి అనే వ్యక్తిని హానీ ట్రాప్ చేయించారు. అతడితో ఆమె పరిచయం పెంచుకునేలా ప్లాన్ చేసి అమలు చేశారు. ఈ క్రమంలో వారిద్దరు సన్నిహితంగా ఉన్నప్పుడు ముఠాకు చెందిన వ్యక్తులు వీడియోలు చిత్రీకరించారు.
అనంతరం ఆ నగ్న వీడియోను మణికంఠకు చూపించి బ్లాక్ మెయిల్ చేయటం మొదలుపెట్టారు. వ్యవహారం సెటిల్ చేసుకుందాం రమ్మని పిలిచి.. అతడిని కిడ్నాప్ చేశారు. మణికంఠరెడ్డి వద్దనుంచి దాదాపు 63 వేల రూపాయల విలువైన ఆభరణాలు దోచుకున్నారు. అతడితో ప్రాంసరీ నోట్లు, డాక్యుమెంట్లపై సంతకాలు చేయించుకున్నారు. ఇది జరిగిన తర్వాత మరో వ్యాపారిని కూడా ఇలాగే ట్రాప్ చేసేందుకు ప్రయత్నించిందీ ముఠా. అయితే ఇంతలోనే బాధితుడు ధైర్యం చేసి పోలీసులకు చెప్పడంతో వారి ఆట కట్టించారు.
మొత్తం ఏడుగురిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు పోలీసులు. మరోవైపు ఈ ముఠా లీడర్ దుర్గారెడ్డి పరారు కావడంతో అతడి కోసం వెతుకుతున్నారు. ముక్కూ మొహం తెలియని యువతుల నుంచి వాట్సాప్ మెసేజ్లు, కాల్స్ వస్తే... ఆ మత్తులో పడిపోతే అంతే సంగతులంటున్నారు పోలీసులు. అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. ఏదైనా ఒకపనిని తలపెట్టేముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించాలంటున్నారు.