జగన్ ప్రభుత్వం అన్నీ ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం పెట్టాలని సంచలన నిర్ణయం తీసుకున్న సంగతీ తెల్సిందే. ఇప్పటికే ఈ నిర్ణయం పట్ల ప్రతిపక్షాలు నానా రాద్ధాంతం చేస్తున్నాయి. అయితే ఇప్పుడు ఈ లొల్లి పార్లమెంట్ దాకా వెళ్లిన సంగతీ తెల్సిందే. పార్లమెంటు లో ఏపీలో ఇంగ్లీష్ మీడియం చదువులపై దుమారం రేపింది. టీడీపీ ఎంపీ కేశినేని దీన్ని లేవనెత్తడం.. ఏపీ లో తెలుగు భాషను బతికించాలంటూ కేంద్రాన్ని కోరడం పై వైసీపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. వైసీపీ ఎంపీలు కేశినేని ప్రసంగాన్ని అడ్డుకున్నారు. అయితే ఈ క్రమంలోనే మాట్లాడిన వైసీపీ నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు రాంగ్ స్టెప్ వేశారు. అదే ఇప్పుడు తెలుగుదేశం పాలిట అస్త్రంగా మారింది.


వైసీపీ నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు  పార్లమెంట్ లో ఇదే విషయం మీద  'ఇంగ్లీష్ మీడియం' చదువుల పై చర్చ సందర్భంగా మాట్లాడే అవకాశం వచ్చింది. ఈ సందర్భంగా ఆయన వైసీపీ పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా లైన్ తీసుకొని మాట్లాడడం కలకలం రేపింది. తెలుగు భాష ఉన్నతికి కేంద్రం సహకరించాలని ఆయన అనడం వైసీపీ తోటి ఎంపీలను సైతం నివ్వెరపరిచింది. అయితే అలా తెలిసి అన్నాడో  ఫ్లోలో అన్నాడో కానీ అది టీడీపీ కి అస్త్రమైంది. జగన్ పార్టీ ఎంపీలు తెలుగు భాష ఉన్నతికి కోరుతుంటే జగన్ మాత్రం సమాధి చేస్తున్నాడంటూ టీడీపీ నేతలు విమర్శలు మొదలు పెట్టారు.



దీనితో వైసీపీ పార్టీ మీదకే విమర్శలు రివర్స్ అయ్యాయి. ఈ వివాదం పెద్దది అవటంతో సీఎం జగన్ సీరియస్ అయినట్లు తెలిసింది. నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజుపై జగన్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు వైసీపీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. పేదల కోసం ప్రవేశపెట్టిన ఇంగ్లీష్ మీడియం చదువుల కు వ్యతిరేకంగా ఏ ఎంపీ మాట్లాడినా పార్టీ పరంగా చర్యలు తప్పవని రఘురామకృష్ణం రాజును జగన్ హెచ్చరించినట్లుగా పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది. రఘురామకృష్ణం రాజు నుంచి వివరణ తీసుకోవాలని గోదావరి జిల్లాల పార్టీ ఇన్ చార్జి వైవీ సుబ్బారెడ్డి ని ఆదేశించినట్లు సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: