రాజకీయాల్లో అప్పడప్పుడు భలే సరదా సన్నివేశాలు జరుగుతుంటాయి. తెలిసి చేసినా తెలియకుండా చేసినా కొన్ని విషయాలు మహా ముద్దుగా ఉంటాయి. నవ్వులు పూయిస్తుంటాయి. అసెంబ్లీ సమావేశాలు అంటే ఇప్పుటు తిట్టుకుంటూ కొట్టుకుంటూ ఉండే నేతలు అప్పుడప్పుడు వాటిని మరిచిపోయి హాయిగా నవ్వుకునేందుకు ప్రయత్నం చేస్తుంటారు. రాష్ట్రం ఏదైనా.. అసెంబ్లీ ఎక్కడైనా ఆ సమావేశాల్లో ఒకరికొరుకు తిట్టుకోవడం.. దుమ్మెత్తి పోసుకోవడం.. అవినీతిని బయటపెట్టుకోవడంతోనే కాలం గడిచిపోతుంది.
అసెంబ్లీలో బలం ఉంటె పధకాలు అమలు చేసుకుంటారు. బొటాబొటిగా ఉంటె.. వాటి అమలుపై సమస్యలు ఎదుర్కొంటారు. మొత్తానికైతే.. ఎదో ఒకటి చేసి బిల్లులైతే పాస్ చేయించుకుంటారు. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఇదే జరుగుతుంది. మెజారిటీని బట్టే అసెంబ్లీలో హడావుడి ఉంటుంది. అయితే, ఒడిశా అసెంబ్లీలో ఓ సంఘటన జరిగింది. ఈ సంఘటన ప్రతి ఒక్కరిని నవ్వేలా చేసింది. దానికి కారణం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే తారా ప్రసాద్.
ఓడిశాలోని బహినీపతి నియోజక వర్గం ఎమ్మెల్యే తారా ప్రసాద్ తన నియోజక వర్గంలో జరిగిన గురించి మాట్లాడుతున్న సమయంలో స్పీకర్ ఎన్ఎన్ పాత్రో అభినందించారు. స్పీకర్ అభినందిస్తే.. ధన్యవాదాలు చెప్పాలి. కానీ, తారా ప్రసాద్ దానికి భిన్నంగా ఫ్లైయింగ్ కిస్ ఇచ్చారు. తారా ప్రసాద్ స్పీకర్ కు ఇలా ఫ్లైయింగ్ కిస్ ఇవ్వడంతో అక్కడ ప్రతి ఒక్కరు షాక్ అయ్యారు. స్పీకర్ కు ఫ్లైయింగ్ కిస్ ఇవ్వడం ఏంటి అని ప్రశ్నించారు. సభలోని సభ్యులు తార ప్రసాద్ చేసిన దానిపై కొంత అసహనంగా ఉండటంతో తారా ప్రసాద్ వివరణ ఇచ్చారు.
స్పీకర్ తన నియోజక వర్గం అభివృద్ధి గురించి చెప్పే సమయంలో మెచ్చుకున్నారని, దానికి ప్రతిగా ఫ్లైయింగ్ కిస్ ఇచ్చానని, గౌరవానికి సూచనగా మాత్రమే ఇలా చేసినట్టు అయన పేర్కొన్నారు. అంతేకాదు, ఒడిశా అసెంబ్లీలోని 147 మంది ఎమ్మెల్యేలు తనకు మాట్లాడేందుకు అవకాశం ఇచ్చారని, దానికి ప్రతిగా ఇలా చేశానని తారా ప్రసాద్ చెప్పడంతో సభలోని ప్రతి ఒక్కరు నవ్వులు పూయించారు. అప్పటి వరకు సీరియస్ గా సాగిన సభ తారా ప్రసాద్ మాటలతో ఎంటర్టైన్ గా మారిపోయింది.