ప్రతి బుధవారం రోజున జగన్ కేబినెట్ మీటింగ్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఈరోజు జరిగిన కేబినెట్ మీటింగ్ లో అనేక విషయాల గురించి చర్చించారు. అందులో ముఖ్యమైనది గ్రామ సచివాలయం, వాలంటీర్ల వ్యవస్థ. ఈ వాలంటరీర్ వ్యవస్థను మరింత బలోపేతం చేయాలనీ అధికారులకు సూచించారు. గ్రామాల్లో ఏర్పాటు చేసిన గ్రామ సచివాలయం ద్వారానే పరిపాలన సాగాలని, అప్పుడే గ్రామాల్లోని ప్రజలకు సక్రమంగా అన్ని పధకాలు అందుతాయన్నది జగన్ ఉద్దేశ్యం.
ఇందులో భాగంగానే రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో గ్రామ సచివాలయంను ఏర్పాటు చేశారు. సచివాలయంలో సిబ్బందిని, అలానే గ్రామాల్లో ప్రతి 50 కుటుంబాలకు ఒక వాలంటీరును నియమించారు. ఒక్కో వాలంటీర్ కు నెలకు రూ. 5వేల రూపాయల జీతం ఇస్తున్నారు. ఇది గొప్ప విషయం అనే చెప్పాలి. ఎందుకంటే, ఉన్న ఊరిలో నెలకు ఐదువేల రూపాయలు సంపాదించుకోవడం మంచిదే కదా.
పైగా సేవచేస్తున్నట్టు కూడా ఉంటుంది. ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉంటుంది. అయితే, ఈ వ్యవస్థను మరింత బలోపేతం చేయాలనీ, గ్రామ సచివాలయంలో, వాలంటీర్లలో సమాచార వ్యవస్థను పెంచాలని జగన్ ఈ సందర్భంగా అధికారులకు సూచించారు. సమాచారం లోపం కారణంగా అక్కడక్కడా కొన్ని పొరపాట్లు జరుగుతున్నాయి. ఈ పొరపాట్లను సరిదిద్దుకోవడానికి ప్రభుత్వం సిద్ధం అయ్యింది. అన్ని సర్దుకుంటాయని ప్రభుత్వం చెప్తున్నది.
ఇక ఇదిలా ఉంటె, 1వ తరగతి నుంచి 6 వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియంలో బోధనకు సంబంధించిన జీవోను ప్రభుత్వం విడుదల చేసింది. దీని ప్రకారం వచ్చే ఏడాది నుంచి రాష్ట్రంలోని 45 వేల పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం విద్యను బోధించబోతున్నారు. ఉపాధ్యాయులకు ఇంగ్లీష్ లో తర్ఫీదు ఇవ్వబోతున్నారు. తర్ఫీదు ఇచ్చే బాధ్యతను ఎన్.సి.ఈ.ఆర్.టికి ప్రభుత్వం అప్పగించింది. ఉపాధ్యాయులను ఇంగ్లీష్ లో నిపుణులుగా తయారు చేసేందుకు అన్ని రకాలుగా ప్రభుత్వం చర్యలు తీసుకోబోతుండటం విశేషం.