తెలంగాణలో సుదీర్ఘంగా కొనసాగిన 'గ్రూప్-2' వివాదం సమసిపోవడంతో అక్టోబరు 24న టీఎస్‌పీఎస్సీ గ్రూప్-2 విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే మరోసారి గ్రూప్-2 నియామకాలకు సంబంధించి మరో అడ్డంకి  ఎదురైంది. గ్రూప్‌-2 ఫైనల్‌ ప్రొవిజనల్‌ లిస్ట్‌పై స్టే విధించినట్లు బుధవారం (నవంబరు 20) హైకోర్టు తెలిపింది. దీనిపై తదుపరి ఆదేశాలు వచ్చే వరకు నియామకాలు చేపట్టకూడదని టీఎస్‌పీఎస్సీని హైకోర్టు ఆదేశించింది.

 

గ్రూప్-2 నియామకాలకు సంబంధించిన కేసులో గతంలో హైకోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పును దిక్కరిస్తూ టీఎస్‌పీఎస్సీ వ్యవహరించిందని కొంతమంది అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించిన విషయం విదితమే. పరీక్షలో వైట్నర్‌, ట్యాంపరింగ్‌, స్క్రాచింగ్‌ చేసిన అభ్యర్థులను సెలక్ట్‌ చేయొద్దని వారు వేసిన పిటిషన్‌లో పేర్కొన్నారు. దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం గ్రూప్‌-2 పరీక్షల్లో అలా గుర్తించిన జవాబులు తీసివేసి మిగిలిన వారికి ఇంటర్య్వూలు నిర్వహించాలని కోర్టు ఆదేశించింది. అభ్యర్థుల్లో 1:2 ప్రకారం నియామకాలు జరపాలని హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ వెల్లడించింది.

 

అయితే హైకోర్టు ధర్మాసనం ఇచ్చని ఆదేశాలను పట్టించుకోకుండా మళ్లీ అదే అభ్యర్థులను ఎంపికచేసి టీఎస్‌పీఎస్సీ గ్రూప్-2 ఫలితాలను ప్రకటించిందని.. ఫైనల్‌ లిస్టుకు సెలక్ట్‌ కానీ కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారించిన హైకోర్టు కౌంటర్‌ దాఖలు చేయాల్సిందిగా టీఎస్‌పీఎస్సీని ఆదేశించింది. తదుపరి ఆదేశాలు ఇచ్చేంత వరకు ఎలాంటి నియామకాలు చేపట్టడానికి వీలులేదని పేర్కొంటూ.. తదుపరి విచారణను నవంబరు 25కు వాయిదా వేసింది.

 

తెలంగాణ రాష్ట్ర పరిధిలోని వివిధ శాఖల్లో 1032 గ్రూప్-2 పోస్టుల భర్తీకి 2016 నవంబర్ 11, 13 తేదీల్లో టీఎస్‌పీఎస్సీ రాతపరీక్షలు నిర్వహించింది. వీటిలో 284 ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఎస్సై పోస్టులు, 259 డిప్యూటీ ఎమ్మార్వో, 19 మునిసిపల్ కమిషనర్, 90 అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, 156 అసిస్టెంట్ కమర్షియల్ టాక్స్ ఆఫీసర్, 67 పంచాయత్ రాజ్ ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్, 11 గ్రేడ్-1 ఎగ్జూక్యూటివ్ ఆఫీసర్, 62 అసిస్టెంట్ రిజిస్ట్రార్, 28 ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్ సెక్షన్ ఆఫీసర్, 20 అసిస్టెంట్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ (టెక్స్‌టైల్స్), 28 అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (ఫైనాన్స్) తదితర పోస్టులు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: