గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ పార్టీ మారడం ఏమో గాని కృష్ణా జిల్లా సీనియర్ టీడీపీ నేత దేవినేని ఉమా చేసిన హడావుడి మాత్రం అంతా ఇంతా కాదు. రాజకీయంగా బలంగా ఉన్న జిల్లాను బలహీనంగా మార్చిన ఘనతను, బలమైన నాయకులను పార్టీ మారే విధంగా చేసిన ఘనతను సొంతం చేసిన మాజీ మంత్రి గారు ఇదే క్రమంలో గన్నవరం వైసీపీ ఇంచార్జ్ గా ఉన్న... యార్లగడ్డ వెంకట్రావుని రెచ్చగొట్టే కార్యక్రమం చేశారు.
ఈ కార్యక్రమం ఉమా చేయడం వెనుక ఆద్యంతం సహకారం అందించిన ఇతర నేతలు కూడా యార్లగడ్డ బుధవారం నిర్వహించిన ప్రెస్ మీట్ చూసి ఆశ్చర్యపోయారు. ఆయన ఎక్కువగా ఏం మాట్లాడలేదు... జగన్ పై తనకు నమ్మకం ఉందని, జగన్ మంచి వ్యక్తి అని... తన సమస్యను జగన్ చూసుకుంటారని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు ఉమాకు గట్టిగానే తగిలాయి. వంశీ పార్టీ మారగానే గన్నవరం సీటు టీడీపీ నుంచి నీకు ఇస్తామని ఆయన చుట్టూ తిరిగారు ఉమా..
స్వయంగా ఆయన్ను కలవడానికి ఉమా వెళ్లారు. వంశీ రాజీనామా చేయడం ఖాయమని టీడీపీ సీటు నీకు రావడం ఖాయమని చెప్పినా సరే, వంశీ పార్టీ మారతాను అని చెప్పినా సరే.. యార్లగడ్డ... వంశీ వచ్చినప్పుడు చూద్దామని అన్నారు. యార్లగడ్డను రెచ్చగొట్టి పార్టీ మారే విధంగా చెయ్యాలని ఉమా అన్ని రకాల ప్రయత్నాలు చేశారు. అయినా సరే ఫలితం మాత్రం పెద్దగా కనపడలేదు.
ఇవన్నీ ముందే గమనించిన మంత్రి కొడాలి నాని, పేర్ని నానీ... జగన్ వద్దకు సమస్యను తీసుకువెళ్లి పరిష్కారం చూపించే ప్రయత్నం చేశారు. చివరిగా యార్లగడ్డ విషయంలో మెయిన్గా కొడాలి నాని యార్కర్ బాల్కు ఉమా క్లీన్బౌల్డ్ అయ్యారనే విషయం స్పష్టంగా అర్ధమవుతుంది. ఆయన్ను పార్టీలోకి తీసుకోవడానికి సామాజిక వర్గాన్ని కూడా ప్రస్తావించారని కొందరు అంటున్నారు.