ఇటీవల టీడీపీకి రాజీనామా చేసి జగన్‌కు జై కొట్టాడు వంశీ. అయితే, టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్‌పై ఓ రేంజ్‌లో విమర్శలు గుప్పించారు. జూనియర్ ఎన్టీఆర్‌ తెలుగుదేశం పార్టీకి దూరంగా ఉండడంపై కూడా సంచలన వ్యాఖ్యలు చేసి పొలిటికల్ సర్కిల్స్‌లో హీట్ పెంచేశారు. ఇప్పటికి వల్లభనేని వంశీ రాజేసిన చిచ్చు రగులుతూనే ఉంది. 

మంత్రి కొడాలి నాని.. ఎమ్మెల్యే వంశీ వ్యాఖ్యలపై టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఉమా ఘాటుగా స్పందించారు. విజయవాడలో ఆయన మాట్లాడుతూ.. ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రాజకీయ అవసరాల కోసమే పార్టీ మారారని విమర్శించారు. అధికారంలో ఉన్నపుడు ఇవన్నీ ఎందుకు గుర్తుకు రాలేదని ప్రశ్నించారు. మంత్రి కొడాలి నాని తిరుమల ఆలయాన్ని కించపరిచేలా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2009లో చంద్రబాబు చేతుల మీదుగా బీఫాం తీసుకున్న విషయం గుర్తుంచుకోవాలంటూ చురకలంటించారు. గర్వం తలకెక్కితే పతనమేనని.. జాగ్రత్తగా ఉండాలంటూ నానికి హితవు పలికారు.

చంద్రబాబు, లోకేష్‌పై అనవసర వ్యాఖ్యలు చేయడం తగదని హితవు పలికారు. దేవినేని అవినాష్ అధికారంలో  ఉన్నప్పుడే పార్టీలో చేరారు. ఇప్పుడు వైఎస్సార్సీపీలోకి వెళ్లారు. అవి వలస పక్షులంటూ విమర్శలు గుప్పించారు ఉమా.. జూనియర్ ఎన్టీఆర్‌ను చంద్రబాబు వాడుకుని వదిలేశారని వంశీ చేసిన వ్యాఖ్యలపై బోండా ఉమ స్పందించారు. జూనియర్ ఎన్టీఆర్ అనే వ్యక్తిని అత్యంత ఎక్కువగా వాడుకున్నది కొడాలి నాని, వల్లభనేని వంశీయేనని.. తెలుగుదేశం, చంద్రబాబు కాదన్నారు. 

అయినా తెలుగుదేశం మా తాత పెట్టిన పార్టీ. నన్నెవరూ ఈ పార్టీలో ఉండమని చెప్పక్కర్లేదు. అది నాబాధ్యత అని జూనియర్ ఎన్టీఆరే చెప్పారని బోండా గుర్తు చేశారు. జూనియర్ ఎన్టీఆర్ పార్టీ వైపు రాకుండా ఉండడానికి కారణం కూడా ఆ ఇద్దరే అని బోండా వ్యాఖ్యానించారు. సినిమా ఫీల్డ్‌లో ఉన్నారు కాబట్టే రాజకీయాలకు దూరంగా ఉన్నారని బోండా ఉమ అభిప్రాయపడ్డారు. కొడాలి నాని, వంశీ.. వాళ్ల సీట్ల కోసం ఎన్టీఆర్‌ను ఉపయోగించుకున్నారని విమర్శించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: