ఏపీలో దూసుకువచ్చేందుకు బీజేపీ కచ్చితమైన వ్యూహాలతో ముందుకుసాగుతోంది. ఏపీలో ఆ పార్టీకి ఇపుడు ఒక పార్టీ పోవాలి. మరో పార్టీ కలసిరావాలి. ఇందుకోసం చేయాల్సినందంతా తెరవెనక చేస్తోందని గట్టిగా ప్రచారంలో ఉంది. దానికి తగినట్లుగానే ఏపీలో బీజేపీని యాక్టివ్ చేస్తున్నారు. అన్ని అస్త్రాలు మకూర్చుకుంటున్నారు. ఈ విషయంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా వ్యూహాలే వేరుగా ఉంటాయి. ఈ షార్ట్ కట్ మెదడ్స్ ఇపుడు ఏపీలో ఆయన పక్కాగా అమలు చేస్తున్నారని అంటున్నారు.
అందుకే ఏపీలో టీడీపీని గట్టిగా టార్గెట్ చేస్తున్నారని ప్రచారం సాగుతోంది. దానికి పసుపు పార్టీ విఫల రాజకీయం కూడా బాగా సహకరిస్తోంది. ఏపీలో బీజేపీ ఫోర్స్ గా ఎదగాలంటే టీడీపీ ప్రధాన రాజకీయ స్రవంతి నుంచి పక్కకు తప్పుకోవాలి. బాబు అయితే అందుకు సుతరామూ ఒప్పుకోరు, మళ్ళీ పొత్తులకు ఆయన చేతులు చాస్తున్నారు. ఇపుడు మేమే మేజర్ పార్టనర్ గా ఉంటాం, వైసీపీకి ఎదురు నిలబడతాం అంటోంది బీజేపీ. దానికి తగిన పూర్వ రంగాన్ని కూడా బీజేపీ సిధ్ధం చేసుకుంది.
మరో వైపు ఇటీవల కాలంలో జనసేనాని పవన్ మెత్తబడుతున్నారు. కమలనాధుల మీద ఆయన ప్రశంసలు కూడా కురిపిస్తున్నారు. దేశంలో మోడీ, అమిత్ షా అత్యంత శక్తిమంతులు అని కూడా పవన్ కీర్తిస్తున్నారు. బీజేపీకి కూడా పవన్ చేరువ కావడం ఇష్టమే. అయితే ఈసారి పొత్తులు ఉండవు, ఏకంగా జనసేన బీజేపీలో విలీనం కావడమే. ఇదే షరతు మీద బీజేపీ పవన్ తో చర్చలు జరుపుతుందని అంటున్నారు. ఇది ఉభయతారకంగా ఉంటుందని కూడా కాషాయదళం అంటోంది.
మరి చూడాలి బీజేపీ వ్యూహాలు ఎంతవరకూ ఫలిస్తాయో. ఏపీలో చూడబోతే జగన్ బలంగా ఉన్నారు. ఆయన జనాన్నే నమ్ముకుని రాజకీయం చేస్తున్నారు. మరి ఈ ప్రధాన పార్టీల రాజకీయం సక్సెస్ అవుతుందా అన్నది ఆలోచించాల్సిందే.