మన దేశంలోని మధ్య తరగతి ప్రజలకు కేంద్ర ప్రభుత్వం త్వరలోనే శుభవార్త అందించనుంది. ఏంటి.. మధ్యతరగతి వారికీ శుభవార్త నా అని అనుకుంటున్నారా ? అవును మన మధ్య తరగతి ప్రజలకే కేంద్రం త్వరలో శుభవార్త చెప్పనుంది. ఆ శుభవార్త ఏంటంటే.. ఇది వరుకు ఉన్న ఆయుష్మాన్ భారత్ తరహాలో దేశంలోని మధ్యతరగతి ప్రజలకు రూ.300 ప్రీమియం చెల్లింపుతో కొత్తగా ఆరోగ్య సంరక్షణ పథకాన్ని అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ కొత్త ఆరోగ్య పథకంను నీతి ఆయోగ్ రూపకల్పన చేసింది. దేశంలో 50 శాతం ఉన్న మధ్యతరగతి ప్రజలు కేవలం 300 రూపాయల ప్రీమియం చెల్లించి మెరుగైన వైద్యసేవలు పొందేందుకు వీలుగా ఈ కొత్త ఆరోగ్య పథకాన్ని రూపొందించారు. అయితే దేశంలోని 40 శాతం మంది పేద ప్రజలకు ఆయుష్మాన్ భారత్ పథకం కింద ఉచిత వైద్యం అందిస్తున్నారు.
కాగా దేశంలో అధిక ఆదాయవర్గాలైన పదిశాతం మంది వైద్యం కోసం డబ్బు చెల్లించగలరు. కాని మధ్యతరగతికి చెందిన మరో 40 శాతం మందికి నామమాత్రపు ప్రీమియంతో వైద్యసేవలు అందించేలా దేశంలో 1.5 లక్షల ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేయాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ కేంద్రాల్లో బీపీ, మధుమేహం, క్యాన్సర్ తదితర వ్యాధులకు చికిత్స చేయాలని నిర్ణయించారు.
అయితే ఇందులో భాగంగా నీతి ఆయోగ్ ఉపాధ్యక్షులు రాజీవ్ కుమార్, నీతిఆయోగ్ ఆరోగ్య సలహాదారు అలోక్ కుమార్ లు రూపొందించిన నివేదికను తాజాగా విడుదల చేశారు. మరి ఈ కొత్త ఆరోగ్య పథకం ఎప్పుడు ప్రారంభమవుతుంది అనేది ఇంకా తెలియాల్సి ఉంది. కాగా ఈ పథకం వల్ల ఎందరో మధ్య తరగతి ప్రజలకు అతి తక్కువ ధరకే ఆరోగ్య చికిత్సలు అందుతాయి.