ఏపీలో జగన్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత తెలంగాణలో ఉన్న కేసీఆర్ సర్కారుకు మంచి సన్నిహిత సంభందాలు ఏర్పడ్డాయి. అయితే గతంలో టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు చంద్రబాబుకు .. కేసీఆర్ కు అస్సలు పడేది కాదని తెల్సిన సంగతే.  చాలా సందర్భాల్లో వీరిద్దరి మధ్య ఉప్పు..నిప్పు అన్నట్లు పరిస్థితి ఉండేది. బాబుతో సంబంధాలు చెడిపోవటానికి కారణం ఆయన తీరే ప్రధాన కారణంగా చెబుతారు. కట్ చేస్తే.. ఏపీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఏపీ సీఎంగా జగన్ అధికారాన్ని చేజిక్కించుకోవటంతో రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య చక్కటి బంధం ఉన్నట్లుగా కొన్ని సమావేశాలు సాగాయి.

 

అయితే అంతా బాగానే ఉన్నప్పటికీ ఈ మధ్య జరుగుతున్న కొన్ని సంఘటనలు ఏపీకి .. తెలంగాణకు మధ్య దూరాన్ని పెంచుతున్నాయి. అయితే.. విధానపరమైన నిర్ణయాలు.. రాష్ట్ర ప్రయోజనాలే తప్పించి మరింకేమీ లేవన్న మాట పలువురి నోట వినిపిస్తోంది. కేసీఆర్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టకు జాతీయ హోదా ఇవ్వొద్దంటూ ఏపీ ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాయటం సంచలనంగా మారింది. ఎందుకిలా? ఇలాంటి నిర్ణయాన్ని ఏపీ ప్రభుత్వం ఎందుకు తీసుకుందన్నది ఆసక్తికర చర్చ నడుస్తోంది. అదే సమయంలో ఏపీ ప్రభుత్వం రాసిన లేఖపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమే కాదు.. మరెవరూ కూడా పెదవి విప్పలేదు.

 

దీనితో ఏపీ ప్రభుత్వానికి .. తెలంగాణ ప్రభుత్వానికి ఎక్కడ చెడిందని అందరికీ సందేహాలు వస్తున్నాయి. ఇంతకీ.. ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్యన మనస్పర్థలకు కారణం ఏమిటి? అన్న ప్రశ్నకు సమాధానం వెతికితే.. ఎవరికి వారు వారి.. వారి రాష్ట్రాల ప్రయోజనాల కోసం చేస్తున్న ప్రయత్నాలే ఇలాంటి పరిస్థితికి కారణమంటున్నారు. తాజాగా ఇరువురు అధినేతల మధ్య దూరానికి కారణం ఆర్టీసీ ఆస్తులన్న మాట బలంగా వినిపిస్తోంది. రాష్ట్ర విభజన జరిగి దగ్గర దగ్గర ఆరు సంవత్సరాలు కావొస్తున్నా.. ఇప్పటివరకూ ఆర్టీసీ ఆస్తుల విభజన పూర్తి కాలేదు. ఏపీఎస్ ఆర్టీసీకే గుర్తింపు ఉంది కానీ టీఎస్ ఆర్టీసీకి  గుర్తింపు లేదన్న మాట ఇటీవల బయటకు రావటం తెలిసిందే. ఒక అవగాహనతో రెండు రాష్ట్రాలకు చెందిన ఆర్టీసీలు పని చేస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: