విశాఖపట్నం కేంద్రంగా ఏర్పాటైన దక్షిణ కోస్తా రైల్వే జోన్లో భాగమైన వాల్తేరు డివిజన్ను యధావిధిగా కొనసాగించాలని వైఎస్సార్సీపీ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. విశాఖపట్నం కేంద్రంగా పనిచేస్తున్న వాల్తేరు డివిజన్ భారతీయ రైల్వేలో అత్యధిక ఆదాయం ఆర్జిస్తున్న డివిజన్లలో అయిదో స్థానంలో ఉందని అన్నారు. దేశంలోని నార్త్-వెస్ట్రన్ రైల్వే జోన్, నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వే జోన్ల ఉమ్మడి ఆదాయం కంటే కూడా వాల్తేరు డివిజన్ ఆదాయం ఎక్కువని తెలిపారు. ఈస్ట్ కోస్ట్ రైల్వేలో వాల్తేరు డివిజన్ ఆదాయం తూర్పు తీర రైల్వేలోనే మూడవ అత్యధిక ఆదాయ వనరుగా మారిందని చెప్పారు. రాజ్యసభ జీరో అవర్లో ఆయన ఈ అంశాన్ని లేవనెత్తారు.
గణనీయంగా ఎదుగుతున్న వాల్తేరు రైల్వే డివిజన్ను మరింతగా ప్రోత్సహించాల్సిందిపోయి వాల్తేరు డివిజన్ను రద్దు చేసి దానిని దక్షిణ కోస్తా రైల్వే జోన్లోని విజయవాడ డివిజన్ పరిధిలోకి తీసుకురావడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విజయసాయిరెడ్డి అన్నారు. ఈ తప్పిదం అనేక సమస్యలకు, అనర్ధాలకు దారితీసే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఎక్కడో 350 కిలోమీటర్ల దూరంలో ఉన్న విజయవాడ డివిజన్లో వాల్తేరు డివిజన్ను విలీనం చేయాలన్న ఆలోచన రైల్వే నిర్వహణ, విపత్తు యాజమాన్యానికి సంబంధించి అనేక సమస్యలకు దారితీస్తుందని విజయసాయిరెడ్డి తెలిపారు. ప్రమాదాల సమయంలో త్వరగా స్పందించే సామర్ధ్యం తగ్గిపోయే అవకాశం ఉంది. అలాగే ప్రయాణీకుల, భద్రత, రైళ్ళ నిర్వహణ వంటి సున్నితమైన అంశాల నుంచి దృష్టి మరలే పరిస్థితి ఉందని విజయసాయిరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. విశాఖపట్నంలో ఇప్పటికే పూర్తిస్తాయి డివిజన్ వ్యవస్థ పనిచేస్తోంది. కార్గో టెర్మినల్స్, లోకో షెడ్, వ్యాగన్ వర్క్షాప్తోపాటు 2300 మంది సిబ్బందికి సరిపడ స్టాఫ్ క్వార్టర్లు ఉన్నాయని విజయసాయిరెడ్డి తెలిపారు. వాల్తేరు డివిజన్ను కొనసాగించడం వలన రైల్వేలపై అదనపు భారం ఏదీ ఉండదు. కానీ వాల్తేరు డివిజన్ను తరలించడం వలన మౌలిక వసతుల ఏర్పాటు కోసం అనవసరమైన ఖర్చులను భరించాల్సి వస్తుందని తెలిపారు.
ఒక డివిజన్ను రద్దు చేయడం అన్నది రైల్వేల చరిత్రలోనే లేదని విజయసాయిరెడ్డి తెలిపారు. అలాంటిది 125 ఏళ్ళ చరిత్ర కలిగిన వాల్తేరు డివిజన్ను రద్దు చేయాలని రైల్వే యాజమాన్యం భావిస్తే అది రవాణాపరంగా పెద్ద తప్పిదం అవుతుంది. అలాగే ఆంధ్ర ప్రదేశ్ ప్రజల మనోభావాలను సైతం దెబ్బతీసినట్లవుతుందని విజయసాయి రెడ్డి అన్నారు. ఈ అంశాలను దృష్టికి ఉంచుకుని వాల్తేరు డివిజన్ను యధావిధిగా కొనసాగించాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఉత్తారంధ్ర ప్రజల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని రాయగడ డివిజన్ సరిహద్దులను ఖరారు చేయాలని కూడా ఆయన ప్రభుత్వాన్ని కోరారు.