`సమ్మె విరమిస్తాం.. కండిషన్స్ పెట్టొద్దు`ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి ప్రకటన. మరి దీనికి...తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎలా స్పందిస్తారు? అన్ని వర్గాల్లో ఉన్న సందేహం! విశ్వసనీయవర్గాల సమాచారం మేరకు...కేసీఆర్ తనదైన శైలిలోనే...ఈ అంశంపై స్పందించారట. ‘కచ్చితంగా కండిషన్స్ ఉంటాయి. ఎందుకు సమ్మెకు వెళ్లామా అనే రీతిలో...ఆ కండిషన్స్ ఉంటాయి’ అని ఆయన సన్నిహితులతో వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది.
ఆర్టీసీ జేఏసీ బుధవారం అత్యవసర సమావేశం ఏర్పాటు చేసుకొని..కీలక ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. సమ్మెపై విచారణ చేపట్టాలని హైకోర్ట్ లేబర్ కోర్టుకు సూచించడం లేబర్ కోర్ట్ లో తమకు న్యాయం జరుగుతుందన్న భరోసా ఉండటం...అక్టోబర్ 4 ముందు ఉన్న పరిస్థితులు ఆర్టీసీలో ఉంటే వెంటనే తాము సమ్మెను విరమిస్తామని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి తెలిపారు. కార్మికుల ఆత్మగౌరవాన్ని కాపాడుతూ ఎలాంటి షరతులు లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో కార్మికుల్ని విధుల్లోకి తీసుకోవాలని, షరతులు విధిస్తూ సంతకాలు పెట్టమన్నా సహించేది లేదన్నారు. కార్మికులు సంతకాలు పెట్టాల్సి వస్తే అటెండెన్స్ రిజిస్టర్ తో తప్పా ఎక్కడా సంతకాలు పెట్టరని అన్నారు.
అయితే, దీనికి తెలంగాణ సీఎం కేసీఆర్ ససేమిరా అంటున్నారని ఆర్టీసీ వర్గాలను ఉటంకిస్తూ ప్రచారం జరుగుతోంది. షరతులు లేకుండా ఆర్టీసీ కార్మికులను డ్యూటీలోకి చేర్చుకునే ప్రసక్తి ఉండదని ముఖ్యమంత్రి స్పష్టం చేసినట్లు సమాచారం. ఆర్టీసీ జేఏసీ నేతలు మాట్లాడిన అంశాలపై, పరిస్థితిపై సీఎం కేసీఆర్ అధికారులతో ఆరా తీసినట్లు సమాచారం. ఈ సమావేశంలో కార్మిక సంఘాలపై సీఎం కేసీఆర్ సీరియస్గా ఉన్న విషయం స్పష్టమైందని అంటున్నారు. ``సమ్మె చేయడం వాళ్ల ఇష్టమే. డ్యూటీలో ఎలా చేరాలో కూడా వాళ్లే చెప్తారా? సమ్మె ఇంత దూరం వచ్చాక షరతులు లేకుండా ఎలా డ్యూటీలోకి తీసుకుంటారు? కచ్చితంగా కండిషన్స్ ఉంటాయి. ఎందుకు సమ్మెకు వెళ్లామా అనే తీరుగా ఆ కండిషన్స్ ఉంటాయి. ప్రతి కార్మికుడు లిఖితపూర్వకంగా షరతులను ఆమోదించాల్సి ఉంటుంది`` అని ఆయన స్పష్టం చేసినట్లు సమాచారం. వీటికి తోడుగా...అనేక షరతులు సర్కారు విధించిననున్నట్లు తెలుస్తోంది. ఇకనుంచి సమ్మె చేయబోమని, సమ్మె కాలానికి జీతం అడగబోమని, సంస్థను విలీనం చేయాలంటూ కోరబోమని, అదే సమయంలో ఆర్థిక పరమైన అంశాలను కూడా భవిష్యత్ లో అడగబోమనే విధంగా రాష్ట్ర ప్రభుత్వం షరతులు విధించనున్నట్లు తెలుస్తోంది.
ఆర్టీసీ కార్మికుల అంశంపై గురువారం సీఎం కేసీఆర్ సమీక్షించి తుది నిర్ణయం తీసుకునే అవకాశముంది. ఒక పైన పేర్కొన్నట్లు ప్రచారంలో ఉన్న అంశాలనే ముఖ్యమంత్రి కేసీఆర్ తప్పనిసరి చేస్తే... అటెండెన్స్ రిజిస్టర్లో మినహా మరెక్కడా సంతకాలు పెట్టం...షరతులు అసలే ఒప్పుకోబోం...అని ప్రకటించిన కార్మిక సంఘాల నేతలు...ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.