తెలుగుదేశం పార్టీకి గుడ్‌బై చెప్పి ముఖ్యమంత్రి వైయస్ జగన్ సమక్షంలో పార్టీలో చేరిన యువ‌నేత‌ దేవినేని అవినాష్ తాజాగా టీడీపీ గురించి ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. తాను కార్యకర్తల అభిమానాన్ని సంపాదించుకున్నానే తప్ప డబ్బు సంపాదించలేదన్నారు. టీడీపీలో ఉన్నప్పుడు తానెలాంటి భూకబ్జాలు చేయలేదన్నారు. తనపై ఎటువంటి నేరారోపణలు లేవని..తానెవరికి భయపడాల్సిన అవసరం లేదన్నారు.తన వల్ల టీడీపీకే లాభం జరిగింది తప్ప పార్టీ వల్ల తనకెలాంటి ఉపయోగం జరగలేదన్నారు. ``మా వర్గం కార్యకర్తలకు నాయకులకు పార్టీలో అన్యాయం జరిగింది. ఎన్నిసార్లు చంద్రబాబునాయుడు దృష్టికి, లోకేష్ దృష్టికి తీసుకెళ్లిన వాళ్ళు పట్టించుకోలేదు.. మా అభిమానులు కార్యకర్తల అభీష్టం మేరకే పార్టీ మారాను `` అని వివ‌రించారు.  త‌న‌ను టీడీపీలో టార్గెట్ చేశార‌ని అవినాష్ తెలిపారు. `గత రెండు నెలలుగా మీడియాతో పాటు సోషల్‌ మీడియాలో పలు సందర్భాల్లో నేను టీడీపీని వీడుతున్నాను అంటూ పలు వదంతులు వచ్చాయి. అవి వచ్చాయి అనడం కంటే సృష్టించబడ‍్డాయి అంటే సబబుగా ఉంటుంది.` అని ఆయ‌న వ్యాఖ్యానించారు. 

 

వైసీపీలో చేరిన అనంత‌రం దేవినేని అవినాష్ తొలిసారిగా  మీడియాతో మాట్లాడుతూ ప్రజలకు అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలు జగన్ పై నమ్మకంతోనే  వైసీపీలో చేరానన్నారు. జగన్ తనకు తూర్పు నియోజకవర్గ భాద్యతలు అప్పచెప్పినందుకు ధన్యవాదాలు తెలిపారు.  తూర్పు నియోజకవర్గ ప్రజలను కలుపుకుని ముందుకు వెళతామన్నారు. స్థానిక సంస్దల ఎన్నికలలో వైసీపీ అభ్యర్థుల  గెలుపుకు పూర్తిస్థాయిలో కృషిచేస్తామన్నారు.

 

ముఖ్య‌మంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన నవరత్నాల వలన ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని స్ప‌ష్టం చేశారు. ఆయన చేపట్టిన ప్రజా సంక్షేమ కార్యక్రమాలు నచ్చి పార్టీలో చేరుతున్నానని తెలిపారు. ఆయన అడుగుజాడల్లోనే పార్టీలో నడుస్తానని, త్వరలోనే నెహ్రు అభిమానులు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతారని అవినాష్ ప్ర‌క‌టించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: