అక్టోబర్ 5 వ తేదీ నుంచి నవంబర్ 20 వ తేదీ వరకు ఆర్టీసీ కార్మికులు సమ్మె చేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి అనే ఒక ఒక ఉదేశ్యంతో మొదట సమ్మె ప్రారంభమైన ఆ తరువాత దానితో పాటుగా 26 డిమాండ్లను అందులో పొందుపరిచారు. ఈ 26 డిమాండ్లలో కేవలం రెండు మాత్రమే సరిగా ఉన్నాయని, ఆ రెండు డిమాండ్లు మాత్రమే నెరవేర్చే అవకాశం ఉన్నట్టుగా అప్పట్లో చర్చ జరిగింది. అయితే, రీసెంట్ గా ప్రధాన డిమాండ్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం అనే ప్రక్రియను పక్కన పెట్టి, డిమాండ్లను మాత్రమే పరిష్కరించాలని కోరారు.
అవి కూడా కుదరదని చెప్పింది ప్రభుత్వం. ప్రభుత్వం ఈ విషయంలో కఠినంగా వ్యవహరించడంతో కార్మికులు చివరకు సమ్మె నుంచి విరమించుకోక తప్పలేదు. నిన్నటితో సమ్మె నుంచి విరమించుకున్నారు. సమ్మె నుంచి విరమించుకున్నప్పటికీ, వీరిని తిరిగి విధుల్లో చేర్చుకుంటారు అనే గ్యారెంటీ లేదు. ఈ ఉదయం చాలామంది కార్మికులు విధుల్లోకి చేరేందుకు డిపోలకు వెళ్లగా అక్కడ డిపో మేనేజర్లు వారిని రానివ్వడం లేదట. విధుల్లో చేరదామని వెళ్లిన కార్మికులకు చుక్కెదురైంది.
కాగా, ఈ మధ్యాహ్నం ఆర్టీసీ ఇన్ ఛార్జ్ ఎండి అధికారులతో చర్చలు జరిపారు. అనంతరం ఈ విషయంపై చర్చలు జరిపేందుకు ప్రగతి భవన్ కు వెళ్లారు. ప్రగతి భవన్ లో ప్రభుత్వం సమీక్ష జరుగుతున్నది. విధుల్లోకి తీసుకోవాలా లేదా.. ఒకవేళ తీసుకుంటే ఎలాంటి షరతులు ఉంటాయి. షరతులు ఉంటె వారంతా ఉద్యోగాల్లో చేరుతారా లేదా. చేరకుంటే పరిస్థితి ఏంటి.. ఎలా ముందుకు అడుగులు వేయాలి అనే దానిపై చర్చలు జరుపుతున్నారు.
కార్మికులు సమ్మె చేయడం వలన నష్టం వచ్చింది. వచ్చిన నష్టాన్ని ఇప్పుడు ఎవరూ పూడ్చలేరు. 48 రోజులు సమ్మె చేశారు కాబట్టి వాళ్లకు ఈ సమ్మె కాలంలో జీతాలు ఇస్తారు అని కూడా అనుకోవడం లేదు. సెప్టెంబర్ నెల జీతాలు ఇంకా వాళ్లకు అందలేదు అన్నది వాస్తవం. ఆ జీతాలను పక్కన పెడితే.. సమ్మె చేసి, సమ్మెను విరమించిన 48వేలమంది కార్మికులను ఉద్యోగాల్లోకి తీసుకుంటారా లేదా అన్నది మరికాసేపట్లోనే తేలిపోతుంది.