ఆర్టీసీ సమ్మెలోకి కేంద్ర ప్రభుత్వం ఎంట్రీ ఇవ్వనుందా? గత కొద్దికాలంగా జరుగుతున్న పరిణామాలను కేంద్రం ఆరాతీయనుందా...అంటే అవుననే సమాధానం వస్తోంది. తెలంగాణలో జరుగుతోన్న ఆర్టీసీ సమ్మెపై కేంద్రమంత్రి నితిన్ గడ్కరీకి వివరించామని నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ధర్మపురి వెల్లడించారు. ఆర్టీసీ ఆస్తులని తమ వారికి కట్టబెట్టే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన అరవింద్ ఈ మేరకు కీలక వ్యాఖ్యలు చేశారు.
ఎంపీలు బండి సంజయ్, సోయం బాపురావుతో కలిసి ఢిల్లీలోని విజయ్ చౌక్లో నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ధర్మపురి మీడియాతో మాట్లాడారు. కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని కలిసి తెలంగాణలో జరుగుతోన్న ఆర్టీసీ సమ్మెను వివరించామని వెల్లడించారు. ఆర్టీసీలో కేంద్రం వాటా కూడా ఉందని రాష్ట్ర రవాణా శాఖ అధికారులతో వెంటనే మాట్లాడుతా అని గడ్కరీ చెప్పినట్టు అర్వింద్ వివరించారు. అందరం కలిసి తెచ్చుకున్న తెలంగాణలో కేసీఆర్ దొరతనం మానేయ్యాలని హితవు పలికారు. ఇప్పటికే 28 మంది కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారని వారి కుటుంబాలను వెంటనే ఆదుకోవాలని అర్వింద్ డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి వెంటనే ఆర్టీసీ కార్మికులు భేషరతుగా విధుల్లోకి తీసుకోవాలన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో కాలుష్యం మీద టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు పార్లమెంట్ ను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఎంపీ అర్వింద్ తీవ్రంగా ఖండించారు. హుస్సేన్ సాగర్, పెద్ద చెరువు, బాలానగర్ చెరువులు పూర్తిగా కలుషితం అయ్యాయాని, ఫ్యాక్టరీ ల నుండి వచ్చే రసాయనాలు, పొగతో ప్రజలు జబ్బులకు గురవుతున్నారని అన్నారు. తెలంగాణలో కోతులకు సైతం పార్క్ ఉందని నామా నాగేశ్వరరావు పార్లమెంటు వేదికగా ప్రకటించడంపై అర్వింద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఎక్కడ కోతులకు పార్క్ కట్టలేదని, సీఎం ఫార్మ్ హౌస్ చూసి అదే కోతుల పార్క్ అనుకుంటున్నారని అర్వింద్ ఎద్దేవా చేశారు. నామా నాగేశ్వరరావు తమ వ్యాపారాల కోసం పార్లమెంట్ లో కేసీఆర్ భజన చేయొద్దని ఎంపీ అర్వింద్ హితవు పలికారు. ట్విట్టర్ వేదికగా ప్రజలు వినతులు ఇచ్చినా కూడా కేటీఆర్ ఎక్కడ స్పందించలేదన్నారు.