తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఆప్తుడు...రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ పరిధి విస్తరిస్తోంది. రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఇచ్చిన చాలెంజ్ను బిత్తిరి సత్తి స్వీకరించి ఈ రోజు మూడు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా బిత్తిరి సత్తి మాట్లాడుతూ రోజురోజుకు పెరిగిపోతున్న వాతావరణ కాలుష్యాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరు మొక్కలను నాటాలని అదేవిధంగా వాటిని సంరక్షించే బాధ్యత కూడా తీసుకోవాలని తెలిపారు. రాజ్యసభ సభ్యుడు సంతోష్ ఒక మంచి గొప్ప కార్యక్రమాన్ని చేపట్టారు అని ప్రశంసించారు. ఈ సందర్భంగా సంతోష్ మరో నలుగురిని మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. హాస్య నటుడు బ్రహ్మానందం, ముఖ్యమంత్రి కేసీఆర్ మనవడు కల్వకుంట్ల హిమాన్ష్ రావు, సినీనటుడు ప్రియాదర్శిని, తీన్మార్ శివ జ్యోతిలను మొక్కలు నాటాలని బిత్తిరి సత్తి పిలుపునిచ్చారు.
కాగా, గ్రీన్ ఛాలెంజ్ను రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివన్ష్ నారాయన్ సింగ్ స్వీకరించారు. కాలుష్యం బారిన పడకుండా, ఆరోగ్యంగా జీవించాలంటే, స్వచ్చమైన గాలి అందరికీ అందాలన్నారు. ప్రతీ ఒక్కరూ మూడు మొక్కలు నాటడం ద్వారా పచ్చదనాన్ని, ఆక్సీజన్ ను పెంపొందించవచ్చని కోరారు. గ్రీన్ ఛాలెంజ్ అద్భుతం, దీనిని ప్రారంభించిన రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ అభినందిస్తున్నామని రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివన్ష్ నారాయన్ సింగ్ తెలిపారు. తాను త్వరలోనే మూడు మొక్కలు నాటుతా, ప్రతీ ఒక్కరూ తాము నాటిన మొక్కలను సంరక్షించాలని కోరారు.
ఇదిలాఉండగా, ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన ప్రముఖ సినీనటుడు, సూపర్ స్టార్ కృష్ణ మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు. మొక్కలు నాడడమే కాకుండా మరో ముగ్గురిని ఆయన ఛాలెంజ్ చేశారు. గ్రీన్ ఛాలెంజ్ తో పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తున్న ఎంపీ సంతోష్ కుమార్ పై కృష్ణ ప్రశంసల వర్షం కురిపించారు. కాగా, ప్రతీ ఒక్కరు చూపించే ప్రేమానురాగాల వల్లే గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమం..హరితయజ్ఞంలా దూసుకుపోతుందని ఎంపీ సంతోష్ కుమార్ సంతోషం వ్యక్తం చేశారు.