టీ ఆర్ ఎస్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్రావు పౌరసత్వాన్ని రద్దు చేయడానికి బీజేపీ ఇంతకాలం ఎందుకు ఎదురు చూసింది. 2009 నుంచి జరుగుతున్న పౌరసత్వం రద్దుపై పదేండ్ల తరువాత కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంలో అంతర్యం ఏమిటి..? ఈ పదవి రద్దు వెనుక బీజేపీకి స్వార్థం ఏమైనా ఉందా...? టీ ఆర్ ఎస్కు బీజేపీకి చెడినందుకే ఇప్పుడు ఇలా నిర్ణయం తీసుకుని టీ ఆర్ ఎస్ పార్టీని ఇరుకున పెట్టాలని ఆలోచిస్తుందా..? లేక టీఆర్ఎస్ను తెలంగాణలో ఇబ్బందులకు గురి చేయడంతో పాటుగా బీజేపీ బలోపేతం అయ్యేందుకు వేస్తున్న ఎత్తుగడులో భాగంగానే చెన్నమనేని రమేష్ పౌరసత్వాన్ని రద్దు చేసిందా..? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి..
ఓవైపు బీజేపీ బలోపేతం కావడం.. టీ ఆర్ ఎస్ను ఇరుకున పెట్టడం కోసం చెన్నమనేని రమేష్ పౌరసత్వం రద్దు చేయడం వెనుక మరోక రహస్యం దాగుందనే ప్రచారం ముమ్మరంగా జరుగుతుంది. తెలంగాణలో జరుగుతున్న ఈ పరిణామాలను ఓమారు సునిశితంగా పరిశీలిస్తే బీజేపీ అంతర్గతంగా చేస్తున్న ఈ వ్యవహరంలో అనేక విషయాలు బోధపడుతాయి. వేములవాడ అసెంబ్లీ నియోజకవర్గ స్థానం నుంచి 2009లో అప్పటి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన ఆది శ్రీనివాస్ చెన్నమనేని రమేష్ చేతిలో ఓడిపోయారు.
చెన్నమనేని రమేష్ జర్మనీ పౌరసత్వం కలిగిన కూడా భారత్ పౌరసత్వంకు ధరఖాస్తు చేసుకోవడం, దానికి భారత హోంమంత్రిత్వ శాఖ కొన్ని విచారణలు చేయడం, దానికి రమేష్ నుంచి కొన్ని వివరణలు తీసుకోవడం జరిగింది. అయితే రమేష్ అసలు తాను జర్మనీకి ఏడాది కాలంలో ఎప్పుడు వెళ్ళలేదని తప్పుడు దృవీకరణ ఇవ్వడంతో అదే నిజమని నమ్మిన హోంమంత్రిత్వ శాఖ భారత పౌరసత్వం ఇచ్చింది. దీంతో ఆది శ్రీనివాస్ పిర్యాదు చేశారు. దీనికి తోడు హైకోర్టులో పిటిషన్ వేశారు.
ఇక ఆది శ్రీనివాస్ అప్పటి నుంచి పోరాటం చేస్తూనే ఉన్నారు. 2009లో కేంద్ర హోంశాఖలో ఫిర్యాదు చేయడంతో హోంశాఖ అప్పుడు కరీంనగర్ ఎస్పీని విచారణ చేయాలని ఆదేశించి, విచారణ జరిపి నివేధిక ఇవ్వడంతో, ఆ నివేధిక హైకోర్టులో సమర్పించడంతో హైకోర్టు 2013 ఆగస్టు 14 రమేష్ ఎన్నికను రద్దు చేసింది. దీంతో ఆయన తిరిగి సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. సుప్రీంకోర్టు నుంచి ఆ వ్యవహారం తిరిగి కేంద్ర హోంశాఖ కు చేరింది. కేంద్ర హోంశాఖ చెన్నమనేని పౌరసత్వం చెల్లదు అని నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం కూడా చెన్నమనేని ఎన్నిక చెల్లదని, పౌరసత్వం రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.
అయితే చెన్నమనేని కోసమే చెన్నమనేని పౌరసత్వాన్ని రద్దు చేసిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇంతకు ఈ చెన్నమనేని రమేష్ రద్దు ఏ చెన్నమనేని కోసం చేశారు అనే సందేహం కలుగొచ్చు. మహరాష్ట్ర గవర్నర్గా పనిచేసిన బీజేపీ సీనియర్ నేత చెన్నమనేని విద్యాసాగర్రావు కోసం రమేష్ పౌరసత్వాన్ని రద్దు చేసినట్లు తెలంగాణలో ప్రచారం జరుగుతుంది. తెలంగాణలో బీజేపీని బలోపేతం చేసే క్రమంలో విద్యాసాగర్రావు సేవలు ఉపయోగించుకోవాలని బీజేపీ భావిస్తుంది.
అయితే వేములవాడ స్థానాన్ని ఖాళీ చేయిస్తే అక్కడి నుంచి విద్యాసాగర్రావును అసెంబ్లీకి పోటీ చేయించి తెలంగాణలో బీజేపీని బలోపేతం చేసేందుకు ప్రయత్నంలో భాగమే ఈ చర్య అని అనుకుంటున్నారు రాజకీయ పరిశీలకులు. చెన్నమనేని విద్యాసాగర్రావు కోసమే బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఇలా రమేష్ పౌరసత్వాన్ని రద్దు చేసిందని టీ ఆర్ ఎస్ శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి. అయితే కొసమెరుపు ఏంటంటే చెన్నమనేని రమేష్కు విద్యాసాగర్రావు స్వయాన చిన్నాన.