తెలుగుదేశం పార్టీ నేత‌, మాజీ మంత్రి దేవినేని ఉమామ‌హేశ్వ‌ర‌రావుపై వైసీపీ నేత‌, మైలవరం శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాద్‌ ధ్వజమెత్తారు. మాజీ మంత్రి ఉమాపై వివిధ అంశాల‌ను ప్ర‌స్తావిస్తూ...వ‌సంత విరుచుకుప‌డ్డారు. ముఖ్యమంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డితో పాటుగా రాష్ట్ర మంత్రులు, శాసనసభ్యులపై మాజీ మంత్రి దేవినేని  ఉమామహేశ్వరరావు చేసిన ఆరోపణలను స‌రికాద‌ని ఎమ్మెల్యే వసంత కృష్ణ‌ప్రసాద్ స్పష్టం చేశారు.

 

టీడీపీ నేత‌ దేవినేని ఉమా నోట్లో నోరు పెడితే బురదలో రాయి వేసినట్లేనని ఎమ్మెల్యే వసంత కృష్ణ‌ప్రసాద్ వ్యాఖ్యానించారు. చాదస్తపు మొగుడు చెప్తే వినడు...గిల్లితే ఏడుస్తాడు అన్నట్లుగా ఉమా వ్యవహార శైలి ఉందంటూ ఎద్దేవా చేశారు. నిరంతరం ఎదుటి వారిపై తప్పుడు ఆరోపణలు చేయడం ఉమాకు అలవాటని ఆయ‌న ఆరోపించారు. ఉమా పెద్ద డ్రామా కంపెనీ ఆర్టిస్ట్ అని కృష్ణ‌ప్ర‌సాద్ విరుచుకు ప‌డ్డారు. ఎన్నికల సమయంలో తనపై ఆరోపణలకు గుడిలో ప్రమాణం చేయడానికి తాను సిద్ధమని ఎమ్మెల్యే వసంత కృష్ణ‌ప్రసాద్ స్ప‌ష్టం చేశారు. ఉమా కూడా గత ఎన్నికల్లో ఎంత ఖర్చు పెట్టారో ప్రమాణం చేసి చెప్పాలని ఆయ‌న‌ సవాల్ విసిరారు. లక్షల మంది ప్రజలకు తానేంటో, ఉమా ఏంటో తెలుసని ఎమ్మెల్యే వసంత కృష్ణ‌ప్రసాద్ వ్యాఖ్యానించారు.

 

 

టీడీపీ నేత‌ ఉమా మహేశ్వరరావుని ప్రజలు రోజూ టీవీల్లో చూడలేక ఇబ్బంది పడుతున్నారని ఎమ్మెల్యే వసంత కృష్ణ‌ప్రసాద్ వ్యాఖ్యానించారు. ఆయ‌న తీరును ప్రజలు  అసహ్యించుకుంటున్నారని విమర్శించారు. ఇరిగేషన్ పనుల్లో ఉమా ఏ రకంగా కమీషన్లు తీసుకున్నారో చెప్పడానికి కాంట్రాక్టర్లు రెడీగా ఉన్నారని వ‌సంత కృష్ణ‌ప్ర‌సాద్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో పంపిణీ చేసిన నోట్లు వసంత కృష్ణ ప్రసాదు ప్రింటు చేయలేదనీ, ఉమా లాంటి మాయా కంత్రీ గాళ్ళ దగ్గర కూడా డబ్బులున్నాయన్నారు. ప్ర‌జలు ఇప్పటికే ఉమాకు ఎన్నికలలో బుద్ధి చెప్పారని వ‌సంత కృష్ణ‌ప్రసాద్ అన్నారు. రాబోయే రోజుల్లో కూడా గట్టిగా బుద్ది చెప్తారని స్పష్టం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: