ఆర్టీసీ సమ్మె ఎట్టకేలకు విజయవంతంగా కార్మికులు విరమించారు. 48 రోజులపాటు సాగిన సమ్మె చివరకు విషాదంగా ముగిసింది. తప్పనిసరి పరిస్థితుల్లో సమ్మెను విరమించాల్సి వచ్చింది. ఈ విరమణతో కార్మికులు ఇబ్బందుల్లో పడిపోయారు. సమ్మె విరమించినా ప్రభుత్వం ప్రస్తుతానికి వీరి ఉద్యోగాలపైనా, విధులపైనా ఎలాంటి సూచనలు చేయడం లేదు. కార్మికులు డిపోలకు వెళ్లి అక్కడి నుంచి వెనక్కి తిరిగి వస్తున్నారు. డిపో మేనేజర్లు ఈ విషయంలో వారికి ఎలాంటి హామీ ఇవ్వడం లేదు.
డిపోల వద్దకు చేరుకున్న కార్మికులు ప్రభుత్వ నిర్ణయం తరువాతే ఏదైనా డెసిషన్ తీసుకుంటామని అంటున్నారు. నిన్న కెసిఆర్ సమ్మె విషయంలో సమీక్ష నిర్వహించిన తరువాత కూడా ఈ విషయంపై ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం విశేషం. సమ్మెను యధాతధంగా కొనసాగించే పరిస్థితి లేదని అంటున్నారు. బస్సులు నడపాలి అంటే భారీగా డబ్బు కావాలి. ఆర్టీసీ ఇప్పటికే నష్టాల్లో ఉన్నది.
ఆర్టీసీకి ఇప్పుడు మరలా ప్రభుత్వం డబ్బు ఇస్తుందా అంటే ఇచ్చే అవకాశం లేదన్నది వాస్తవం. ప్రభుత్వ, ప్రైవేట్ సహకారంతో బస్సులు నడపాలని చూస్తున్నది. ఒకవేళ ప్రైవేట్ బస్సులను నడిపితే.. ఆ బస్సుల్లో పాసులు అనుమతి ఇస్తారా లేదా అన్నది కూడా చూడాలి. ఇప్పటికే ప్రభుత్వం నడుపుతున్న ప్రైవేట్ బస్సుల్లో పాస్ లను అనుమతించడం లేదు. తాత్కాలిక కండక్టర్లు బస్సుల్లో చేతివాటం చూపిస్తున్నారు.
ఇక ఇదిలా ఉంటె, ఆర్టీసీ సమ్మె చేస్తున్న సమయంలో అనేక మంది కార్మికులను అరెస్ట్ చేశారు. కేసులు పెట్టారు. దానిపై ఎలాంటి నిర్ణయం తీసుకోకుండానే కార్మికులు సమ్మె విరమిస్తే వారి పరిస్థితి ఏంటి.. కేసుల్లో ఇరుక్కున్న కార్మికులకు న్యాయం జరుగుతుందా.. జరిగితే ఎలాంటి న్యాయం చేయబోతున్నారు.. అలానే ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్న సమయంలో ఆత్మహత్యలు చేసుకున్న కార్మికులు ఉన్నారు. వారి కుటుంబాలకు రక్షణ ఏంటి.. వారిని ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం లభిస్తుంది అన్నది తెలియాలి.