తెలంగాణ ఆర్టీసి పై సీఎం కేసీఆర్ సమీక్ష సమావేశం ముగిసింది. దీని పై దాదాపు 6 గంటల పాటు సీఎం అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆ తర్వాత ఒక ప్రకటనను సీఎంవో కార్యాలయం విడుదల చేసింది. ఆర్టీసిని ప్రస్తుత పరిస్థితులలో నడపడం సాధ్యం కాదని ప్రభుత్వం నిర్ణయించింది. శుక్రవారం హైకోర్టులో రూట్ల ప్రైవేటీకరణపై తీర్పు రానుండడంతో తీర్పు తర్వాత నిర్ణయాన్ని ప్రకటించాలని సర్కార్ నిర్ణయించింది. కార్మికులకు నష్టం లేకుండా ఆర్టీసిని 50 శాతం ప్రభుత్వం. 50 శాతం ప్రైవేటు బస్సులతో సడిపేందుకే సీఎం నిర్ణయించారని విశ్వసనీయ సమాచారం.

 

ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్.టి.సి.) విషయంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి? అనే అంశంపై ప్రభుత్వం విస్తృత చర్చ జరిపింది. ఆర్టీసీ ఆర్థిక పరిస్థితి. కోర్టు నిర్ణయాలు, కోర్టులో ఇంకా నడుస్తున్న కేసులు తదితర అంశాలపై కూలంకశంగా అధ్యయనం చేయాలని నిర్ణయించింది. వాస్తవ పరిస్థితుల ప్రాతిపదికన, ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్య అందించడమే ప్రథమ కర్తవ్యంగా, ఆర్టీసీ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని ప్రభుత్వం భావిస్తున్నది.

 

"ఆర్టీసీకి ఇప్పటికే 5వేల కోట్లకు పైగా అప్పులున్నాయి. తక్షణం చెల్లించాల్సిన అస్సలు, బకాయిలు దాదాపు 2వేల కోట్ల వరకు ఉన్నాయి. ప్రావిడెంట్ ఫండ్ అధికారుల ఆదేశం మేరకు ఉద్యోగులకు సెప్టెంబర్ మాసానికి సంబంధించి మొత్తం జీతం చెల్లించాలంటే 240 కోట్ల రూపాయలు కావాలి. సిసిఎస్ కు 500 కోట్ల రూపాయలు ఇవ్వాలి. డీజిల్ బకాయిలు చెల్లించాలి. రెండేళ్లుగా రవాణా పన్ను బకాయి ఉన్నది. 2,600 కాలం చెల్లిన బస్సుల స్థానంలో కొత్త బస్సులు కొనాలి. పిఎఫ్ బకాయిల కింద నెలకు దాదాపు 65-70 కోట్ల రూపాయలు వరకు చెల్లించాల్సి ఉంటుంది. మొత్తంగా ఆర్టీసీ ఇప్పుడున్నట్లు నడవాలంటే నెలకు రూ.640 కోట్ల రూపాయలు కావాలి. ఈ భారమంతా ఎవరు భరించాలి. ఆర్టీసీకి ఇప్పుడంత శక్తి లేదు. ఆర్థిక మాంద్యం కారణంగా ప్రభుత్వం కూడా భరించే పరిస్థితి లేదు. అయినా సరే. ఎంతో కొంత ప్రభుత్వం సహాయం చేసినా, అది ఎంత వరకు కొనసాగించగలుతుంది? ఆర్టీసీకున్న ఒకే ఒక మార్గం బస్సు చార్జీలు పెంచడం.

 

చార్జీలు ఎక్కువైతే ప్రజలు బస్సులు ఎక్కని పరిస్థితి వస్తుంది. ఈ పరిస్థులన్నీ పరిగణలోకి తీసుకుంటే ఆర్టీసీని యధావిధిగా నడపడం సాధ్యం కాదు". అని సమావేశంలో అభిప్రాయం వ్యక్తమయింది.ఈ పరిస్థితులతో పాటు రూట్ల ప్రైవేటీకరణ అంశంపై శుక్రవారం హైకోర్టు తీర్పు వెలువరించే అవకాశం ఉంది. అప్పుడు అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని తుది నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది.

 

ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషి, సీనియర్ అధికారులు నర్సింగ్ రావు, సునిల్ శర్మ, రామకృష్ణ రావు, సందీప్ సుల్తానియా, న్యాయశాఖ కార్యదర్శి సంతోష్ రెడ్డి, ఎజి ప్రసాద్, అడిషనల్ ఎజి రాంచందర్ రావు, ఆర్టీసీ ఈడిలు వెంకటేశ్వరరావు, యాదగిరి తదితరులు పాల్గొన్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: