ఆర్టికల్ 370 రద్దు తరువాత ఇండియా పాక్ దేశాల మధ్య సంబంధాలు దారుణంగా దెబ్బ తిన్నాయి. ఇది కాదనలేని సత్యం. దెబ్బ తిన్నమాట వాస్తవమే.. అయితే, పాక్ తో సంబంధాలను పునరుద్దరించాలని భారత్ ప్రయత్నం చేస్తున్నా, పాక్ మాత్రం సహకరించడం లేదు. ఇండియాను అంతర్జాతీయంగా బ్లేమ్ చేయాలనీ చూస్తున్నది. ఇప్పటికి కూడా తన మంకుపట్టు వదలడం లేదు పాక్. ఇండియాలో అలజడులు సృష్టించిన మసూద్ ను ఇండియా అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది. అటు ఐరాస కూడా మసూద్ తో పాటుగా మరికొంతమందిని, కొన్ని ఉగ్రవాద సంస్థలను ఐరాస నిషేదించింది.
దీంతో ఇండియాపై పగను పెంచుకున్న పాక్, ఆఫ్ఘన్ వంటి దేశాల్లో పనిచేస్తున్న ఇండియా వ్యక్తులను అపహరించి వారిపై ఉగ్రవాదులుగా ముద్రలు వేయడానికి ప్రయత్నిస్తోంది. ఈ ప్రయత్నాలను ఇండియా ఎప్పటికప్పుడు పసిగడుతూ.. వాటిని తిప్పికొడుతున్నది. ఇందులో భాగంగానే పాక్ తన ప్రియతమ దేశం చైనా సహాయంతో ఆఫ్గనిస్తాన్ లోని ఓ బ్యాంక్ లో సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్న అప్పాజీ అంగరను ఉగ్రవాదిగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది. అప్పాజీ ఆంధ్రప్రదేశ్ కు చెందిన తెలుగు వ్యక్తి.
ఈ విషయం గమనించిన ఇండియా అప్పాజీని ఇండియాకు రప్పించింది. జనవరి 18 న అప్పాజీ ఇండియాకు వచ్చేశాడు. 2017 ఫిబ్రవరి 17 న లాహోర్ లోని మాల్ రోడ్డులో ఉగ్రదాడికి పాల్పడినట్టు పాక్ అభియోగాలు మోపింది. అలానే 2014 డిసెంబర్ 16న పెషావర్ లోని సైనిక పాఠశాలపైనా, అదే విధంగా 2016 సెప్టెంబర్ 2న పెషావర్ లోని వార్సాక్ కాలనీలోను ఉగ్రదాడికి పాల్పడ్డారని చెప్తూ అభియోగాలు మోపింది.
ఈ విషయాన్ని పసిగట్టిన భారత్, అప్పాజీని సురక్షితంగా వెనక్కి రప్పించింది. అలానే ఇటీవలే పొరపాటున పాకిస్తాన్ బోర్డర్ లో అడుగుపెట్టిన ప్రశాంత్ ను, మధ్యప్రదేశ్ కు చెందిన ధరిలాల్ ను క్షేమంగా తిరిగి ఇండియాకు రప్పించేందుకు ఏర్పాటు చేస్తున్నది. వారికి ఎలాంటి హాని తలపెట్టకుండా క్షేమంగా ఇండియాకు రప్పించేందుకు ఇండియా దౌత్యపరమైన ఏర్పాట్లు చేస్తున్నది. త్వరలోనే వీరు ఇండియాకు క్షేమంగా తిరిగి వస్తారని ఆశిద్దాం.