ఏదైనా సమస్య వస్తే పరుగు పరుగున దేవుడి దగ్గరకి వెళ్లి స్వామీ నాకు ఈ సమస్య వచ్చింది.. మీరే ఎలాగైనా సరే తీర్చాలి. లేదంటే ఇబ్బందులు పడతాను ప్లీజ్ అని మొక్కుకుంటారు. కానీ, దేవుడికే సమస్య వస్తే ఎవరితో చెప్పుకుంటారు. ఎలా చెప్పుకుంటారు.. ఏమని చెప్పుకుంటారు. దేవుడి దిగివచ్చి నాకు ఈ సమస్య వచ్చిందని ఎవరితోనైనా చెప్తే.. ముందు మనమే నమ్మం వెళ్లి దేవుడికి చెప్పమంటారు.
ఇది నిజం..దేవుడు రాయి రూపంలో ఉన్నాడు కాబట్టి వెళ్లి చెప్పుకుంటాము. చేసిన తప్పులు ఆయనకి చెప్పేస్తుంటారు. ఎందుకంటే పాపం ఆయనకు తెలియదు కదా.. విషయం ఇది అని. నిజంగా దేవుడు మనిషి రూపంలో అక్కడ కూర్చొని ఉంటె అన్ని చెప్తారా అంటే ఖచ్చితంగా చెప్పరు. ఎందుకొచ్చిందిలే అని వెళ్ళిపోతారు. ఇక అసలు విషయంలోకి వస్తే.. దేవుడి దగ్గరకు వచ్చే వాళ్లంతా భక్తులు కారు.. దొంగలు కూడా ఉంటారు అనే సంగతి తెలుసు.
ఓ దొంగ పరమ భక్తుడి రూపంలో ఆలయంలోకి ప్రవేశించాడు. అది పెద్ద రద్దీగా ఉండే ఆలయం కాదు. కానీ, ఇటీవల కాలంలో దొంగతనాలు పెరిగిపోతున్నాయి కాబట్టి ప్రతి గుడిలో సిసి టివిలు ఏర్పాటు చేస్తున్నారు. జాగ్రత్త కోసం. అలా భక్తుడిగా వచ్చిన ఓ దొంగ అమ్మవారి ఆలయంలో అమ్మవారి విగ్రహం ముందు భక్తిగా నటించాడు. ఆత్మప్రదక్షిణ చేశాడు. వినయంగా మొక్కాడు.. అలా మొక్కిన ఆ వ్యక్తి చటుక్కున కిరీటాన్ని చొక్కాలో దాచేసుకొని వెనక్కి తిరగకుండా చెక్కేసాడు.
కిందకు వెళ్లిన తరువాత మరోసారి అమ్మవారికి మొక్కి బైక్ మీద కిరీటంతో ఉడాయించాడు. ఈ సంఘటన గన్ ఫౌండ్రిలోని దుర్గాభవాని ఆలయంలో జరిగింది. ఎప్పటిలాగే పూజారి శివ సాయంత్రం 7 గంటల ప్రాంతంలో వచ్చి చూడగా.. ఆలయంలో కిరీటం కనిపించలేదు. వెంటనే పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాడు. పోలీసులు భక్తుడి ముసుగులో వచ్చిన దొంగ గురించి ఆరా తీస్తున్నారు. భక్తులను కాపాడే దేవుడికే రక్షణ లేదు..మరి సామాన్యులకు రక్షణ ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి.