రాబోయే విద్యా సంవత్సరం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు, మండల, జిల్లా పరిషత్ స్కూళ్లలో 1 నుంచి 10 క్లాసు వరకూ ఇంగ్లిష్ మీడియాన్ని ప్రవేశపెడుతూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై రాజకీయంగా దుమారం రేగుతోంది. అదే సమయంలో...దీనికి మతం కోణం కూడా జోడిస్తున్నారు. క్రైస్తవానికి అనుకూలమైన నిర్ణయం అంటున్నారు. ఈ సమయంలో బీజేపీ దూకుడుగా స్పందిస్తోంది. అయితే, ఇదే అంశం ఆధారంగా ఓ వైసీపీ ఎంపీకి...బీజేపీ పెద్దలు గాలం వేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆయనకు పరోక్షంగా తమ అండ ఉంటుందనే సిగ్నల్ను బీజేపీ పెద్దలు ఇస్తున్నారంటున్నారు.
ఆశ్చర్యాన్ని కలిగిస్తున్న ఈ వివరాల్లోకి వెళితే....ఇంగ్లిష్ మీడియాన్ని ప్రవేశపెడుతూ ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై వైసీపీ నేత, నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు పార్లమెంటు వేదికగా వ్యతిరేక గలం వినిపించారు. ఇంగ్లీష్ మీడియానికి వ్యతిరేకంగా రఘురామకృష్ణంరాజు మాట్లాడటం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీంతో వైసీపీ అధినేత,ఏపీ ముఖ్యమంత్రి, వైఎస్ జగన్ ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీ తీరుపై జిల్లా ఇన్ఛార్జ్ వైవీ సుబ్బారెడ్డితో చర్చించారు. అయితే, ఇప్పటికీ ఇటు సీఎం జగన్కు...అటు వైవీ సుబ్బారెడ్డికి రఘురామకృష్ణంరాజు వివరణ ఇవ్వలేదు.
మరోవైపు, అదే పార్లమెంటు వేదికగా ఆశ్చర్యకర పరిణామాలు జరిగాయి. రాజ్యసభనుంచి తన ఛాంబర్కు వెళుతున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సెంట్రల్ హాల్లో ఎదురైన రఘురామకృష్ణం రాజును ”రాజుగారూ బాగున్నారా” అంటూ ఆప్యాయంగా పలుకరించారు. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిని మాత్రమే పలుకరించే ప్రధాని నరేంద్రమోడీ ఎంపీ రఘురామ కృష్ణంరాజును ఆప్యాయంగా పలుకరించడం, ఇది జరిగింది పార్లమెంటులో ముఖ్యమంత్రి జగన్ నిర్ణయానికి వ్యతిరేకంగా రఘురామకృష్ణంరాజు స్పందించిన తర్వాతే కావడంతో...బీజేపీ ఆయన్ను లాగే ఎత్తుగడ వేస్తోందా అని ప్రచారం జరుగుతోంది.