తెలంగాణాలో కేసీఆర్ పాలనా ఏమంత గొప్పగా లేదని జనాలకు కూడా తెలుసు. ఎన్నికల్లో కెసిఆర్ గెలిచిన తరువాత ఒక్కటంటే ఒక్క హామీని కూడా నెరవేర్చిన పాపాన పోలేదు కేసీఆర్. దీనితో సహజంగానే ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది. కానీ ఆ వ్యతిరేకతను ప్రతిపక్షాలు తమకు అనుకూలంగా మార్చుకోలేకపోయారు. కేసీఆర్ ట్రాప్ లో తెలంగాణలోని ప్రతిపక్షాలన్నీ పడిపోయాయా? అంటే ఔననే సమాధానం వస్తోంది.. తెలంగాణలో రెండోసారి అధికారంలోకి వచ్చాక కేసీఆర్ ఏమీ చేయలేదు. మంత్రివర్గాన్ని మొన్నటివరకు విస్తరించకుండా కాలయాపన చేశారు. కేసీఆర్ రెండోసారి అధికారంలోకి వచ్చాక ప్రజలు ఇచ్చిన ఏ హామీని నెరవేర్చలేదు. 57 ఏళ్లకు పించన్లు సహా రైతుబంధును ఈసారి రైతుల ఖాతాల్లో వేయలేదు.

 

ఇలా చెప్పుకుంటూ పోతే కేసీఆర్ నెరవేర్చిన ఒక్క హామీ కూడా కంటికి కనిపించదు. ఎన్నో పథకాలను నిధుల కొరతతో అమలు చేయలేదు. ఆర్థిక మాంద్యంతో తెలంగాణ ఆర్థిక వ్యవస్థ కకావికలమైన నేపథ్యంలో పైసలు లేక కేసీఆర్ అష్టకష్టాలు పడుతున్నారు. అందుకే ఇప్పుడు ఉన్న పథకాలు.. కొత్త పథకాలను అమలు చేయలేక దాదాపు సంవత్సరం పాటు కేసీఆర్ కాలయాపన చేస్తున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ హామీనిచ్చినవీ.. అమలు చేయాల్సిన పథకాలపై పోరాడాల్సిన ప్రతిపక్షాలు కేసీఆర్ మాయలో పూర్తిగా పడిపోయాయని గుసగుసలు వినిపిస్తున్నాయి.

 

ఇంకా చెప్పుకుంటూ పోతే మధ్యలో వచ్చిన హుజూర్ నగర్ ఎన్నికలు కూడా ప్రతిపక్షాలను పక్క దారి పట్టించాయి. వచ్చిన హుజూర్ నగర్ ఎన్నికలు  రెండు నెలల పాటు ప్రతిపక్షాలను ఫ్రీజ్ చేశాయి. వారు కేసీఆర్ సర్కారు హామీలపై అడగకుండా చేశాయి. దాదాపు రెండు నెలలుగా ఆర్టీసీ సమ్మె కారణంగా ప్రతిపక్షాల ఫోకస్ అంతా అటువైపే మళ్లించడంలో కేసీఆర్ విజయం సాధించారు. దీంతో వేరే సమస్య తెలంగాణలో తెరపైకి రావడం లేదు. డెంగ్యూ మరణాలు రైతు బంధు అందకపోవడం.. పింఛన్లు నిలిచిపోవడం.. కేసీఆర్ కొత్త హామీలు అస్సలు పట్టాలెక్కలేదు. అయినా ప్రతిపక్షాలు మాత్రం కేసీఆర్ ట్రాప్ లో పడిపోయి ఆర్టీసీ సమ్మె చుట్టే తిరుగుతున్నాయి. ఇలా కాగల కార్యం కేసీఆర్ కు ప్రతిపక్షాలే తీర్చాయన్న విషయం వారికి తెలియకపోవడం ఔచిత్యమే.

మరింత సమాచారం తెలుసుకోండి: