నీవంటే నేను, నేనంటే నీవు అంటూ బాసలు చేసి పెళ్లి చేసుకున్న ఓ మహిళ భర్తను చంపింది. ఏడు అడుగులు వేసి నీవెంటే నడుస్తానని చెప్పిన భార్య.. భర్తను అంతమొందించింది. కట్టుకున్నవాడు అని కనికరం లేకుండా కానరాని లోకాలకు పంపింది. ఏమీ తెలియనట్టు నటిస్తూ సినిమా ట్విస్ట్ ను క్రియేట్ చేసింది. మనువాడిన వాడు మరణించాడన్న బాధ లేకుండా తెలివిగా తిరుగుతూ పోలీసులకే అనుమానం రాకుండా అతి తెలివి చూపింది. అర్థరాత్రి భర్తను చంపి ఇంట్లోనే పాతిపెట్టిన చోటే పొయ్యి పెట్టి వంట చేసింది. ఘటనకు సంబంధించి దిమ్మతిరిగే విషయాలు ఈ విధంగా ఉన్నాయి. 

 

మధ్యప్రదేశ్ రాష్ట్రం అనుప్పూర్ జిల్లా కరోండి గ్రామానికి చెందిన 35 ఏళ్ల మహేశ్ బన్వాల్ అనే న్యాయవాది అక్టోబర్ 22 నుంచి కనిపించకుండా పోయాడు. అతని భార్య ప్రమీల తన భర్త కనిపించడం లేదని స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఈ విషయంలో తనకు అనుమానాలు ఉన్నాయని మహేశ్ అన్న అర్జున్ బన్వాల్ పోలీసులను ఆశ్రయించడంతో కథ మలుపు తిరిగింది.

 

మా తమ్ముడు కనిపించకుండా పోయినప్పటి నుంచి అతని భార్య ప్రమీల తమను ఇంట్లోకి రానివ్వడం లేదని పోలీసులకు చెప్పాడు. విచారణ కోసం ఇంటికి వచ్చిన పోలీసులకు దుర్వాసన రావడంతో ఇంట్లో మొత్తం వెతికారు. వంటగదిలో దుర్వాసన ఎక్కువగా వస్తుండటంతో పోలీసులు వంట గదిని మొత్తం తవ్వించారు. అప్పటికే కుళ్లిపోయి ఉన్న మహేశ్ మృతదేహం బయట పడింది. మహేశ్ భార్య ప్రమీల ఎవరికి అనుమానం రాకుండా అతన్ని పాతి పెట్టిన చోటే పోయ్యి పెట్టి వంట చేస్తోంది. 

 

గుట్టు బయటకు తెలియడంతో ప్రమీల ఏడుస్తూ… మహేశ్ పెద్ద అన్న గంగారాం ఈ నేరం చేయడానికి సహకరించాడని ఆరోపణ చేసింది. గంగారాం భార్యతో మహేశ్ కు అక్రమ సంబంధం ఉండటం వల్లే చంపడానికి ప్లాన్ వేశాడని చెప్పింది. నిందితురాలు ప్రమీల ఒక్కతే గొయ్యి తీసి.. తన భర్తను ఎలా పాతిపెట్టగలదని స్థానికులు అంటున్నారు. ప్రమీలను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: