టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ ఏపీ రాజధాని అమరావతి లేకుండా ఇండియా మ్యాప్ విడుదల చేయడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అంతే కాకుండా ఇది కేవలం ఏపీ ప్రజలను అవమానించడమే కాదు.. ప్రధాని మోదీని కూడా అవమానించడమేనన్నారు. గురువారం జరిగిన పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో భాగంగా.. జీరో అవర్లో మాట్లాడిన ఆయన..
అమరావతితో కూడిన ఇండియా మ్యాప్ను తిరిగి జారీ చేయాలని కేంద్రాన్ని కోరారు. ఇక ఇండియా మ్యాప్లో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పేరు లేకపోవడం వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అమరావతిని ఎందుకు గుర్తించలేదంటూ ఏపీకి చెందిన నేతలు మోదీ సర్కారును నిలదీశారు. బాబు సర్కారు వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని బీజేపీ నేతలు విమర్శలు గుప్పించారు.
కాగా ఆయన్ కోరిన విధంగానే స్పంధించిన కేంద్రం పార్లమెంట్లో గల్లా జయదేవ్ అమరావతి విషయమై మాట్లాడిన మరుసటి రోజే.. అమరావతితో కూడిన ఇండియా మ్యాప్ను రిలీజ్ చేసింది. ఈ విషయాన్ని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన కొత్త మ్యాప్ను కూడా ట్వీట్ చేశారు.
ఇకపోతే ఏపీ రాజధాని విషయంలో జరుగుతున్న రగడ విషయం మనందరికి తెలిసిందే. ఇప్పటికే ప్రతిపక్షాలు ఈ విషయమై చేస్తున్న రచ్చ మామూలుగా లేదు. ఇక ఇప్పటి వరకు ఏపీ రాజధాని విషయంలో జగన్ ఏ నిర్ణయాన్ని ప్రకటించలేదు.
ఇకపోతే రాజధాని నిర్మాణం విషయమై ఇది వరకు జగన్ నియమించిన జీఎస్ రావు కమిటి ఈ నెలాఖరులోగా తన నివేదికను ప్రభుత్వానికి అందించనున్నట్లు సమాచారం. కాగా ఈ నివేదిక ఆధారంగా డిసెంబర్ లో జగన్ ఓ ప్రకటన చేయవచ్చని సమాచారం. ఇకపోతే అమరావతి విషయంలో ఉన్న పలు ఊహాగానాలకు డిసెంబర్ నెలలో ఫుల్స్టాప్ పడనుందన్న మాట..