తిరుపతి ఎయిర్పోర్టులో పేలిన విమానం.. విమానం పేలలేదు అండి. విమానం టైరు పేలింది. అది కూడా ప్రయాణికులు నిండుగా ఉన్న సమయంలో ల్యాండింగ్ అయ్యే సమయంలో విమానం టైరు పేలి కలకలం సృష్టించింది. అయితే ఆ శ్రీవారి దయవల్ల ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి నష్టం జరగలేదు.
ఈ ఘటన నిన్న రాత్రి సమయంలో తిరుపతి ఎయిర్ పోర్టులో జరిగింది. ఈ ముప్పు తప్పింది స్పైస్ జెట్ విమానానికె. ముంబై నుంచి హైదరాబాద్ మీదుగా తిరుపతికి వచ్చిన స్పైస్ జెట్ విమానం ల్యాండింగ్ సమయంలో టైర్ పేలిపోయింది. అయితే పైలెట్ అప్రమత్తమవ్వడంతో విమానం సురక్షితంగా ల్యాండ్ అయింది.
దీంతో స్పైస్ జెట్ లో ఉన్న ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. విమానం సేఫ్ గా ల్యాండ్ అయ్యేసరికి ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న అధికారులు విమానానికి మరమ్మత్తులు చేపట్టారు. టైర్లలో గాలి తక్కువగా ఉండడం వల్లే ఈ ఘటన జరిగిందని అధికారులు పేర్కొన్నారు.
కాగా మొన్న సాయంత్రం కూడా ఇదే తరహాలో స్పైస్ జెట్ విమానంలో సాంకేతికత లోపించడంతో ప్రయాణికులు ఎయిర్పోర్టులో తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. సాయంత్రం 04.10 గంటలకు రావాల్సిన స్పైస్ జెట్ విమానం రాత్రి 11 అయినా రాలేదు. దాంతో అప్పుడు కూడా ప్రయాణికులు ఎంతో ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు ఈ ప్రమాదంతో స్పైస్ జెట్ నిర్లక్ష్యంపై ప్రయాణికులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.