జగన్ ది ముఖ్యమంత్రిగా ఆరు నెలల అనుభవం. ఆయన కనీసం మంత్రిగా కూడా పనిచేయలేదు. మొత్తం మీద చూసుకున్న పట్టుమని పదేళ్ళు జగన్ రాజకీయ జీవితం. అయితే జగన్ దేశంలోనే తన పాలనావిధానాలతో అందరికీ స్పూర్తిగా మారుతున్నారు. రాజకీయంగా కాకలు తీరిన ముఖ్యమంత్రులు, రాజకీయ నేతలు సైతం ఫాలో ఫాలో జగన్ అంటున్నారు.
పొరుగున ఉన్న తెలంగాణా ముఖ్యమంత్రి కేసీయార్ ది నాలుగు దశాబ్దాలా రాజకీయ అనుభవం. ఆయన కేంద్ర, రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. అదే విధంగా కేసీయార్ ఆరేళ్ళుగా ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. అటువంటి కేసీయార్ ఏపీ సీఎం జగన్ వైపు చూస్తున్నారు. జగన్ తీసుకున్న కొన్ని నిర్ణయాలను ఆయన సీరియస్ గానే పరిశీలిస్తున్నారు. వాటిని తన రాష్ట్రంలో కూడా అమలు చేయాలనుకుంటున్నారు.
ఇదిలా ఉండగా ఏపీలో వచ్చే ఏడాది నుంచి ప్రాధమిక స్థాయి నుంచి విద్యా బోధన మొత్తం ఆంగ్లంలో జరిపించాలని జగన్ సర్కార్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అదే సమయంలో దాని మీద ఎన్ని ఆందోళనలు చెలరేగినా కూడా జీవో కూడా జారీ చేసి జగన్ ముందుకు వెళ్తున్నారు. దీని మీద విపక్షాల రాద్ధాంతం అంతా ఇంతా కాదు. జగన్ మొత్తం ఏపీనే క్రిస్టియన్ స్టేట్ గా మార్చేస్తున్నాడని కూడా ఆరోపణలు గుప్పించారు.
ఇపుడు తెలంగాణాలో కూడా ఆంగ్లమాధ్యమంలో బోధన పెడితే ఎలా ఉంటుందని కేసీయార్ సర్కార్ సీరియస్ గా ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు సాధ్యాసాధ్యాలపైన తెలంగాణా సర్కార్ ఆలోచిస్తున్నట్లుగా చెబుతున్నారు. విద్యార్ధులతో పాటు, తల్లిదండ్రులు కూడా ఆంగ్ల బోధన వైపు ఆసక్తి చూపిస్తున్న తరుణంలో సర్కార్ బడుల్లో ఇంగ్లీష్ పెడితే బాగుంటుందన్నది తెలంగాణా సర్కార్ ఆలోచనగా చెబుతున్నారు. మొత్తానికి చూసుకుంటే జగన్ నిర్ణయాన్ని తప్పుపట్టిన చంద్రబాబు, పవన్ లాంటి వారు ఇపుడు ఏమంటారో చూడాలి.