మోడీ, అమిత్ షా.. ఇప్పుడు ఇండియాలో ఈ జోడీకి ఎదురు లేదు. రాత్రికి రాత్రి పరిణామాలు మార్చేయడంలో వీరు సిద్ధహస్తులు. మహారాష్ట్రలో ఒక్క రాత్రిలోనే సీన్ మార్చేస్తారు. తెల్లారితే ఉద్దవ్ ధాకరే సీఎం అవుతారని కలలు కంటున్న శివసేనకు .. లేచి చూసేసరికి ఫడ్నవీస్ సీఎంగా కనిపించారు. దీంతో శివసేన సీఎం కలలు కల్లలయ్యాయి.

 

మహారాష్ట్ర రాజకీయాలను మోడీ, అమిత్ షా జోడీ అనూహ్య మలుపులు తిప్పింది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా వరుసగా రెండోసారి దేవేంద్ర ఫడణవీస్‌ ప్రమాణస్వీకారం చేశారు. ఉపముఖ్యమంత్రిగా ఎన్సీపీకి చెందిన అజిత్‌ పవార్‌ ప్రమాణం చేశారు. వీరితో గవర్నర్‌ భగత్‌సింగ్‌ కోశ్యారీ శనివారం ఉదయం ప్రమాణం చేయించారు. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ భాజపా-ఎన్సీపీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి.

 

రాత్రికి రాత్రే పరిణామాలు పూర్తిగా మారిపోయాయి. దీంతో మిత్రపక్షం శివసేనకు భాజపా భారీ షాక్‌ ఇచ్చినట్లయింది. రాష్ట్రంలో సుస్థిర ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నామని శుక్రవారం ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌, శివసేన నాయకుడు ఉద్ధవ్‌ ఠాక్రే ప్రకటించారు. అంతే మోడీ, అమిత్ షా చక్రం తిప్పేశారు. ఎన్సీపీని చీల్చేశారు. రెండు రోజుల క్రితం ప్రధాని మోదీతో పవార్‌ భేటీ అయిన సంగతి తెలిసిందే.

 

మొత్తం మీద మరోసారి సీఎం అయిన ఫడ్నవీస్ కు ఉప ముఖ్యమంత్రి అజిత్‌ పవార్‌కు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. మహారాష్ట్ర ఉజ్వల భవిష్యత్తు కోసం వారు కృషి చేస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రమాణస్వీకారం అనంతరం మోదీ, అమిత్‌ షాకు ఫడణవీస్‌ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

 

అయితే.. శరద్ పవార్ మాత్రం భిన్న ప్రకటన చేశారు. మహారాష్ట్రలో ఏర్పడ్డ నూతన ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడం అజిత్‌ పవార్‌ వ్యక్తిగత నిర్ణయం అని ఆయన ప్రకటించారు. అజిత్‌ పవార్‌ నిర్ణయం పార్టీ నిర్ణయం కాదన్నారు. అజిత్‌ పవార్‌ని తాము సమర్థించడం లేదన్నారు. తాజా పరిణామాలపై ట్విటర్‌ వేదికగా స్పందించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: